హైదరాబాద్, వెలుగు : తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే నదుల అనుసంధానం చేపట్టాలని తెలంగాణ తేల్చిచెప్పింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్కు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ఇచ్చంపల్లి ప్రాజెక్టును ప్రతిపాదించారని, తమ రాష్ట్రంలో ముంపు ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర, చత్తీస్గఢ్ అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు.
తాము నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీ ఇచ్చంపల్లి ప్రతిపాదిత స్థలం నుంచి 24 కిమీల దిగువన ఉంటుందని, ఇంత దగ్గరగా రెండు బ్యారేజీలు నిర్మిస్తే వరద ఎక్కువగా వచ్చే రోజుల్లో నీటి మళ్లింపులో ఇబ్బందులు తలెత్తు తాయ న్నారు. తమ ప్రాజెక్టులు సీతారామ ఎత్తిపోతలు 70 టీఎంసీలు, సమ్మక్క సాగర్ 50, దేవాదుల ఎత్తిపోతలకు 38 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని, అవి తీరిన తర్వాత గోదావరిలో మిగులు జలాలు ఉంటేనే వాటిని గోదావరి, కావేరి అను సంధానానికి ఉపయోగించు కోవాలన్నారు.