- ప్రొడక్షన్ పెంచుతున్న కంపెనీలు
- మిగిలిన వంటనూనెలకు సమానంగా రేట్లు..హెల్తీ కూడా
బిజినెస్ డెస్క్, వెలుగు:
వివిధ కారణాలతో వంటనూనె రేట్లు రికార్డ్ లెవెల్స్కు చేరుకున్నాయి. సన్ఫ్లవర్, పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి దేశంలో ఎక్కువగా వాడే వంటనూనె ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడిపై అదనపు భారంగా తయారయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైస్ బ్రాన్ ఆయిల్ (తవుడు నుంచి తీసే ఆయిల్) వైపు కన్జూమర్లు ఆసక్తి చూపుతున్నారు. రుచి సన్ఫ్లవర్ ఆయిల్ మాదిరే ఉండడంతో ఈ ఆయిల్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. గతంలో హెల్త్పై ఎక్కువ ఫోకస్ పెట్టే కన్జూమర్లు మాత్రమే ఈ ఆయిల్ను అధికంగా వాడేవారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ఆయిల్ వంటి వంట నూనెలతో పోలిస్తే రైస్బ్రాన్ ఆయిల్ రేటు కనీసం 25 శాతం ఎక్కువగా ఉండేది. కానీ, ప్రస్తుతం దేశంలో రైస్ బ్రాన్ ఆయిల్ రేటే మిగిలిన వంట నూనెలతో పోలిస్తే తక్కువగా ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ రేటు టన్నుకి రూ. 1.7 లక్షలు పలుకుతుంటే, రైస్ బ్రాన్ ఆయిల్ రేటు రూ. 1.47 లక్షలుగా ఉంది. దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న వంట నూనెలో రైస్ బ్రాన్ వాటా కేవలం 5 శాతంగానే ఉండేదని, తాజాగా ఈ ఆయిల్కు డిమాండ్ పెరుగుతున్నదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ మాత్రమే తయారు చేసే కంపెనీలు తాజాగా రైస్బ్రాన్ ఆయిల్ బ్రాండ్లను లాంచ్ చేస్తున్నాయని అన్నారు.
రైస్ మిల్లర్లకు మేలు..
రైస్ బ్రాన్ ఆయిల్కు డిమాండ్ పెరుగుతుండడంతో రైస్ మిల్లర్లు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఆయిల్ను కేవలం బై–ప్రొడక్ట్గానే చూశారు. రైస్ బ్రాన్ ఆయిల్కు డిమాండ్ పెరుగుతుండడంతో ఈ ఆయిల్ కోసమే మిల్లర్లు ఆయిల్ ఎక్స్ట్రాక్టర్లను తమ మిల్లులలో ఏర్పాటు చేసుకుంటున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ డిమాండ్ను చేరుకోవడానికి తమ ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని వచ్చే రెండు నెలల్లో రోజుకి 750 టన్నులకు పెంచుతామని రైసెలా గ్రూప్ సీఈఓ పునీత్ గోయల్ పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్రస్తుత కెపాసిటీ రోజుకి 600 టన్నులుగా ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ను తవుడు నుంచి తయారు చేస్తారు. కాగా, ధాన్యాన్ని ఆడించేటప్పుడు వచ్చే తవుడు నుంచి 48 గంటల్లోనే ఆయిల్ను తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న తవుడులో 55 శాతం తవుడు నుంచే ఆయిల్ను తీస్తున్నారు. మిగిలిన వాటిని పశువులకు దాణాగా, ఇతరత్రా అవసరాలకు వాడుతున్నారు.