
భారతీయ సినిమా రంగం ఎప్పుడూ యువతరం స్టార్లతో, భారీ బడ్జెట్లతో, పాన్-ఇండియా కలలతో ముందుకు దూసుకుపోతుంది. ఆగస్టులో భారీ చిత్రాలు విదుదలకు సిద్ధమౌతున్నాయి. ఇప్పటికే వాటిపై అంచనాలు భారీగా మించిపోయాయి. ఇలాంటి సమయంలో యువ హీరోలను పక్కన పెట్టేసి, 74 ఏళ్ల ఒక లెజెండరీ సూపర్ స్టార్ ఎలాంటి ముందస్తు ప్రచార ఆర్భాటం లేకుండానే అందరినీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. ఇది నిజంగా సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతం. 2025 మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి, IMDb (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేయగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' (Coolie) అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
'వార్ 2', 'ది రాజాసాబ్'ను పక్కన పెట్టిన 'కూలీ'
'వార్ 2'(హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్), 'ది రాజాసాబ్' (ప్రభాస్), 'ఆల్ఫా' (ఆలియా భట్) వంటి భారీ అంచనాలున్న చిత్రాలను అధిగమించి 'కూలీ' అగ్రస్థానంలో నిలిచారు. ఇది కేవలం రజనీకాంత్ చెక్కుచెదరని స్టార్డమ్కు నిదర్శనం మాత్రమే కాదు. భారతీయ ప్రేక్షకులు కొత్తదనం, బలమైన కథనం కలగలిసిన చిత్రాలను ఎంతగా కోరుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తుంది. IMDb వెల్లడించిన ప్రకారం, ఈ ర్యాంకింగ్ జనవరి 1 నుండి జూలై 1 వరకు ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా రూపొందించిందని తెలిపింది. ఇది ప్రపంచ సినీ అభిమానుల నిజమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.
స్టార్ క్యాస్ట్తో సినిమాకి పాన్-ఇండియా లుక్
ఆగస్టు 14న విడుదల కానున్న 'కూలీ' కేవలం ఒక సినిమాగా కాకుండా, ఒక "సినిమాటిక్ ఈవెంట్" గా ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. రజనీకాంత్తో పాటు, 38 సంవత్సరాల తర్వాత ఆయనతో మళ్లీ తెర పంచుకుంటున్న సత్యరాజ్ నటిస్తుండడం కూడా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. వీరిద్దరి కాంబినేషన్ 'బాషా' వంటి క్లాసిక్ చిత్రాలను గుర్తు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా, నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ వంటి బహుభాషా నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ పూజా హెగ్డే , అమీర్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ స్టార్ క్యాస్ట్ సినిమాకి ఒక పాన్-ఇండియా లుక్ తీసుకొచ్చింది.
►ALSO READ | Viral : యాంకరింగ్లో 'సిండికేట్'పై ఉదయభాను సంచలన కామెంట్స్..
"ఐఎమ్డిబి నుండి లభించిన ఈ అపూర్వమైన గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులు చూపిన అద్భుతమైన ఉత్సాహానికి నిదర్శనం" అని దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్నారు. "లెజెండ్లైన రజనీకాంత్, సత్యరాజ్ తిరిగి కలవడం తెరపై నిజంగా మ్యాజిక్ను సృష్టించింది. మేము సృష్టించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
ఒకే రోజు 'కూలీ' , 'వార్ 2' రిలీజ్..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 'కూలీ', 'వార్ 2' ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే, IMDb బజ్ను బట్టి చూస్తే, 'కూలీ' తన మార్కెటింగ్ బలం ద్వారా కాకుండా, కేవలం ప్రేక్షకులలో ఉన్న సహజమైన ఆసక్తితోనే ఈ పోరులో మొదటి రౌండ్ను గెలుచుకుందని చెప్పవచ్చు. రజనీకాంత్ అభిమాన గణమే ప్రధాన కారణమైనప్పటికీ, లోకేష్ కనగరాజ్ 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాలతో గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మార్క్ మేకింగ్, కథ చెప్పే విధానం కూడా సినిమాపై భారీ అంచనాలకు కారణమయ్యాయి సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెరపై తలైవా మ్యాజిక్ చేస్తారా...
70 ఏళ్లు పైబడిన ఒక నటుడు ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తికరమైన చిత్రానికి నాయకత్వం వహించడం ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిదని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. పునరుజ్జీవనం, యువతపై ప్రపంచం దృష్టి సారించిన ఈ కాలంలో, 'కూలీ' నిరూపిస్తుంది. బలమైన వారసత్వం, ఆ వారసత్వాన్ని సమకాలీన ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎలా ఆధునీకరించాలో తెలిసిన దర్శకుడు కలిస్తే, అది ఇప్పటికీ అపారమైన ప్రేక్షకులను ఆకర్షించగల అంతిమ శక్తి అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులు కేవలం వినోదాన్ని మాత్రమే కోరుకోవడం లేదు. వారు కథలో లోతు, పాత జ్ఞాపకాల , రజనీకాంత్ వంటి ఒక తలైవా తెరపై చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ నెల రోజుల్లో భారీ ప్రమోషన్లు కూడా షెడ్యూల్ చేయబడినందున, 'కూలీ' ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి. అయితే, ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులలో అపారమైన ఉత్సాహాన్ని నింపింది అనడంలో సందేహం లేదు...