కరోనా లాక్ డౌన్ వల్ల లిక్కర్ దొరక్క తాగుడుకి బానిసైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా మందు బంద్ కావడంతో తట్టుకోలేక తీవ్రమైన మానసిక అస్వస్థత (విత్ డ్రాయల్ సింప్టమ్స్)కు గురై సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండడం ద్వారా ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేద్దామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నిత్యవాసరాలు, కూరగాయలు, మెడికల్ షాపులు తప్ప మిగతా అన్నీ బంద్ చేయాలని ఆదేశించారు.
దీంతో దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులు కూడా మూతపడ్డాయి. అయితే కేరళలోని త్రిస్సూర్ జిల్లా కున్నకూళం ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల సనోజ్ కులాంగర అనే వ్యక్తి మద్యానికి అడిక్ట్ అయి ఉండడంతో ఈ అనూహ్యమైన బ్యాన్ ను తట్టుకోలేకపోయాడు. మందు దొరక్కపోవడంతో తీవ్ర మానసిక, శారీరక అస్వస్థతకు గురై సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. మద్యానికి బానిసైన అతడు.. కొద్ది రోజులుగా మందు లేక అనారోగ్యం బారినపడ్డాడని, ఇవాళ ఉదయం చూసేసరికి ఆత్మహత్య చేసుకుని ఉన్నాడని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇలా మద్యానికి బానిసైన కొందరు ఒక్కసారిగా లిక్కర్ దొరక్కపోవడంతో అస్వస్థతకు గురై తిరువనంతపురంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని కేరళ టూరిజం మంత్రి కె.సురేంద్రన్ తెలిపారు.