- విదేశాల్లోనూ పెరుగుతున్న వైరస్ కేసులు
- మాస్క్ పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తులు
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసులు దేశంతో పాటు విదేశాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాలు మళ్లా ఆంక్షలు విధిస్తున్నాయి. మాస్క్ రూల్ను కంపల్సరీ చేస్తున్నయి. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో మాస్క్ పెట్టుకోవాలని ప్రజలను కోరుతుండగా, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలని జర్మనీ, పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని థాయిలాండ్ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్క రోజులో భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,847 మంది పాజిటివ్గా తేలారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ బారిన పడి మరో 14 మంది చనిపోయారని తేల్చింది. దీంతో మరణాల సంఖ్య 5,24,817కు చేరింది. యాక్టివ్ కేసులు 63,063కు పెరగగా, ఇది టోటల్ ఇన్ఫెక్షన్ రేటులో 0.15 శాతంగా ఉందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. డైలీ పాజిటివిటీ 2.47%, వీక్లీ పాజిటివిటీ 2.41%, డెత్ రేటు 1.21 శాతంగా ఉంది.
ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోండి
కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలని జర్మనీ ప్రజలకు ఆ దేశ హెల్త్ మినిస్టర్ విజ్ఞప్తి చేశారు. దేశానికి వచ్చే టూరిస్టులు కూడా మాస్క్లు ధరించాలని కోరారు. మాస్క్ పెట్టుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడాలని సూచించారు. టూరిస్టుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లను థాయిలాండ్ ఎత్తేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ కంపల్సరీ రూల్ ఇప్పటికే అమలులో ఉంది. అయితే, రద్దీ ప్రాంతాల్లో తప్ప జులై 1 నుంచి అవుట్ డోర్ మాస్క్ రూల్ను ఎత్తివేయనున్నట్లు శుక్రవారం తెలిపింది.
ఢిల్లీలో వెయ్యి, ముంబైలో రెండు వేల కేసులు
మహారాష్ట్రలోని ముంబైలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల్లో 15,656 మందికి టెస్టులు చేయగా, 2,366 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.58 శాతానికి పెరిగింది. ఈ వారంలో 15 శాతానికి పైగా పాజిటివిటీ రేటు రావడం ఇది రెండోసారి. జూన్ 16న 15.11 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కాగా, ఢిల్లీలో వరుసగా మూడో రోజు కరోనా కేసులు వెయ్యి దాటాయి. గురువారం 19,776 మందికి టెస్టులు చేయగా, 1,323 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, హాస్సిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం లేదని హెల్త్ అధికారులు చెప్తుతున్నారు. కాగా, పాజిటివిటీ రేటు 6.69 శాతానికి పెరిగింది.