కరోనా సింప్టమ్స్ మారిపోయాయి

కరోనా సింప్టమ్స్ మారిపోయాయి
  • ఫస్ట్ వేవ్ లో దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్, టేస్ట్, స్మెల్ పోవడం
  • ఇప్పుడు శ్వాస ఇబ్బందే ఎక్కువ: ఐసీఎంఆర్ చీఫ్​ బలరాం భార్గవ 

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుత సెకండ్ వేవ్ లో సింప్టమ్స్ తీరు వేరుగా ఉందని సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పారు. ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు సింప్టమ్స్ విషయంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోందన్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడినవారికి జ్వరం, పొడి దగ్గు, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, అలసట, వాసన తెలియకపోవడం, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బంది వంటి సింప్టమ్స్ ఎక్కువగా కన్పించాయని, ఇప్పుడు శ్వాస ఇబ్బందే బాగా కన్పిస్తోందన్నారు. దీనివల్ల సెకండ్ వేవ్ లో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం విపరీతంగా పెరిగిందని తెలిపారు. ఫస్ట్ వేవ్ కు, ఇప్పటికి డెత్ రేట్ లో పెద్దగా మార్పు లేదన్నారు. రాష్ట్రాల్లో హాస్పిటళ్లలో చేరిన 10 వేల మంది కరోనా పేషెంట్ల డేటా ఆధారంగా ఈ అంచనా వేశామన్నారు.  సెకండ్ వేవ్ లో కేసుల పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్ కరోనానే కారణమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు.
40 ఏళ్లు పైబడిన వాళ్లే 70 శాతం 
ఫస్ట్ వేవ్ లో 0 నుంచి 19 ఏళ్ల మధ్య వారిలో ఇన్ఫెక్షన్ రేటు 5.8 శాతం ఉండగా, ఇప్పుడు 4.2 శాతం ఉందని బలరాం భార్గవ చెప్పారు. 20 నుంచి 40 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఇన్ఫెక్షన్ రేటు అప్పుడు 25 శాతం ఉండగా, ఇప్పుడు కొంచెం తక్కువగా 23 శాతం ఉందన్నారు. రెండు వేవ్స్ లోనూ కరోనా బారిన పడినవారిలో 40 ఏళ్లకు పైబడినవాళ్లే 70 శాతం ఉన్నారని తెలిపారు. ఫస్ట్ వేవ్ లో యావరేజ్ గా 50 ఏండ్ల వారికి కరోనా  బాగా సోకిందని, సెకండ్ వేవ్ లోనూ యావరేజ్ గా 49 ఏండ్ల వయసు వారికి ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. ప్రస్తుత వేవ్ లోనూ వృద్ధులకు ప్రమాదం ఎక్కువే ఉందన్నారు. ప్రస్తుతం అసింప్టమాటిక్, స్వల్ప అనారోగ్యం బారిన పడిన కరోనా పేషెంట్లు ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఆర్టీ పీసీఆర్ పద్ధతి బెస్ట్ అని, దీనితో ఎలాంటి కరోనా మ్యుటెంట్ ను అయినా కచ్చితంగా గుర్తించొచ్చని స్పష్టం చేశారు. అయితే కరోనాపై పోరాటంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, తగిన జాగ్రత్తలు పాటించడం లేదని అభిప్రాయపడ్డారు.