ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి. ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు. ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే పనైపోతున్నది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతోంది.
హైదరాబాద్, వెలుగు: ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయి. ధర కోట్ల రూపాయల్లో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారు. అదీ ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే చాలు.. పనైపోతుంది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతూ వస్తోంది. గత వారం నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న భూములపై హైదరాబాద్ సీసీఎల్ఏ ఆఫీసులో స్పెషల్ మీటింగులు పెడుతూ ఆ లిస్ట్లో నుంచి కొన్నింటిని తీసేస్తున్నారు. ఇదే అదునుగా అర్హతలేని వాటిని కూడా ఈ జాబితాలో నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యదాద్రి భువనగిరితో పాటు రియల్ బూం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనూ డబ్బులు తీసుకుని పీవోబీలో ఉన్న సర్వే నంబర్లను తీసేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 10.12 లక్షల సబ్ డివిజన్ సర్వే నంబర్లు ప్రొహిబిటెట్ లిస్టులో ఉన్నాయి.
ఎకరాకు 10 లక్షల నుంచి కోటి దాకా
ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న సర్వే నంబర్ తొలగించుకునేందుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. కోటి దాకా కూడా పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.5 కోట్లు ఉండగా.. ఆ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంటే దానిని తీయించుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముడుపులు తీసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పనిలో పనిగా అసైన్డ్ ల్యాండ్స్లో ఉన్నవి, ప్రభుత్వ భూములు వంటి వాటిని కూడా డబ్బులు తీసుకుంటూ నిషేధిత జాబితా నుంచి తీసేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎంసీహెచ్ఆర్డీ దగ్గరలో ఉన్న 50 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తీసేశారు. ఈ ఆర్డర్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇక జిల్లాల్లో ఒక ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి సర్వే నంబర్ తొలగించేందుకు బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికారంలో ఉన్న పెద్దలతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్
నిషేధిత జాబితాలో ఉన్న తమ సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ 1.52 లక్షల అప్లికేషన్లు ధరణిలో నమోదయ్యాయి. వాటిని అన్బ్లాక్ చేయాలని కోరుతూ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో అప్లై చేసుకున్నారు. ఇందులో 1.28 లక్షలు అప్లికేషన్లు డిస్పోజ్ చేశారు. అయితే డిస్పోజ్ చేసిన అప్లికేషన్లలో70 శాతం రిజెక్ట్ చేసినవే ఉన్నాయి. కోర్టు ద్వారా వచ్చిన కొన్నింటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అసలు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే లక్షల సర్వే నంబర్లు, సబ్ డివిజన్లు ప్రొహిబిటెడ్లో నమోదు కావడంతో వాటిని అవసరానికి అమ్ముకోలేక అర్హులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆ జిల్లాల్లోనే ఎక్కువ
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 9,493 గ్రామాల్లో ప్రొహిబిటెడ్ జాబితాలో సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో రియల్ బూం కూడా ఎక్కువగా ఉన్నది. ఇదే అదునుగా భావించి అయిన కాడికి దండుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లు, ఇప్పుడు సీసీఎల్ఏకు వచ్చిన ఈడీఎంలు బేరసారాలు చేసుకుంటూ నిషేధిత జాబితాలో భూములను తొలగిస్తున్నారు. ఈ లిస్ట్ నుంచి ఎలా బయటపడాలో తెలియని కొందరు పేద రైతులు ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అప్లికేషన్లు పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.02 లక్షల సబ్ డివిజన్లు, రంగారెడ్డిలో 78,536, సిద్దిపేటలో 55 వేలు, సూర్యాపేటలో 50,126, నల్లగొండలో 90,105, ఖమ్మంలో 68 వేలు, మెదక్లో 41,340 సబ్ డివిజన్ సర్వే నంబర్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గరలో ఒక సర్వే నంబర్లో 8.20 ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఇది అసైన్డ్ ల్యాండ్గా ప్రొహిబిటెడ్ (నిషేధిత) జాబితాలో ఉంది. అక్కడ ఎకరా రూ.3 కోట్లు పలుకుతోంది. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 14 ఎకరాల భూమి ఒక సర్వే నంబర్ లో ధరణిలో పొరపాటున ప్రొహిబిటెడ్ లిస్ట్ నమోదైంది. దీనిని లిస్ట్లో నుంచి తీపించేందుకు మూడుసార్లు అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు. ఇటీవల ఎకరాకు రూ.లక్ష చొప్పున మాట్లాడుకుని ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీసేశారు.