- రూ.40 వేలపైబడిన ఫోన్లకు డిమాండ్
- ఐఫోన్ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లకు మస్తు ఆర్డర్లు
- వెల్లడించిన ప్రిడిక్ట్వ్యూ సర్వే
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల జనంలో చాలా మంది ఆమ్దానీలు తక్కువగా ఉంటున్నా, హైఎండ్/ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు కొనడానికి మాత్రం వెనుకంజ వేయడం లేదు. టైర్ 2, 3 పట్టణాలు, నగరాల్లోని మొబైల్ ఫోన్ రిటైలర్లకు రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన శామ్సంగ్ ఫ్లిప్ ఫోన్, ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్లకు రికార్డుస్థాయిలో డిమాండ్ ఉంది. ఖరీదైన ఫోన్లకు డిమాండ్ 2019 కంటే (కరోనా ముందుకాలం) 50 శాతం ఎక్కువగా ఉందని తాజా స్టడీ వెల్లడించింది. కంపెనీలు విపరీతంగా ప్రచారం చేయడం, జీరో ఈఎంఐ సదుపాయం కల్పించడం, పెంటప్ డిమాండ్ వల్ల హైఎండ్ స్మార్ట్ఫోన్లను భారీగా కొంటున్నారని అనలిటిక్స్ సంస్థ ప్రిడిక్ట్వ్యూ సర్వే వెల్లడించింది. మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో రూ. 40 వేలు అంతకంటే ఎక్కువ కేటగిరీలో కొనుగోళ్ల నిష్పత్తి 80:20గా ఉంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి 65:35 కి తగ్గిపోతుందని అంచనా. స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీకి కాంపోనెంట్ల కొరత లేకుంటే ఈ గ్యాప్ మరింత తగ్గేది. విడిభాగాలు లేకపోవడంతో హైఎండ్ స్మార్ట్ఫోన్ల లాంచ్లు తగ్గాయి. చిన్న నగరాలకు ఫోన్ల సరఫరా కాస్త తక్కువగా ఉంది.
అమ్మకాలను పెంచుతున్న జీరో ఈఎంఐ
డౌన్పేమెంట్ చేయకుండానే నెలవారీ కిస్తీలను చెల్లించే పద్ధతి (జీరో ఈఎంఐ)ని రిటైలర్లు, కంపెనీలు అందుబాటులోకి తేవడం హైఎండ్ ఫోన్ల కొనుగోళ్లు పెరగడానికి ప్రధాన కారణమని సెల్లర్లు చెబుతున్నారు. అంతేగాక వర్క్ ఫ్రం హోం విధానం వచ్చాక కూడా హైఎండ్ ఫోన్లకు గిరాకీ ఎక్కువయింది. చాలా మంది ఇంటి నుంచే బిజినెస్, ఆఫీసు పనులు చేయడానికి వీటిని కొన్నారు. స్టూడెంట్లు ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడ్డారు. పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, సమర్థంగా పనిచేసే ప్రాసెసర్ కలిగిన ఫోన్లకు గిరాకీ ఎక్కువయింది. ‘‘2019కు ముందు అయితే చిన్న పట్టణాల్లో ఖరీదైన స్మార్ట్ఫోన్లకు ఆదరణ ఉండేది కాదు. గత ఏడాది నుంచి పరిస్థితులు మారాయి. మంచి బ్రాండ్ ఫోన్ కొనాలని చాలా మంది కోరుకుంటున్నారు ’’ అని ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) చైర్మన్ పంకజ్ మహీంద్రూ అన్నారు. ప్రిడిక్ట్వ్యూ వైస్ ప్రెసిడెంట్ కునాల్ సర్కార్ మాట్లాడుతూ ఫోన్లు కొనడానికి ఎక్కువ మంది కస్టమర్లు మల్టీబ్రాండ్ల షోరూమ్ల కంటే ఎక్స్క్లూజివ్ స్టోర్లకు వెళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోగల పట్టణాల్లోనూ హైఎండ్ ఫోన్లు విపరీతంగా అమ్ముడవటం తాను గమనించానని వివరించారు.
చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి..
"వల్సాద్, మెహసానా, వాపి, ఆనంద్, కలోల్ వంటి చిన్న పట్టణాల కస్టమర్లు ఐఫోన్ 13, శామ్సంగ్ హైఎండ్ ఫోన్లను అడుగుతున్నారు. త్వరలో వివో లాంచ్ చేయబోయే ఫోన్ల కోసం కూడా ఎంక్వైరీలు చేసి వెళ్తున్నారు ”అని గుజరాత్కు చెందిన హైఎండ్ స్మార్ట్ఫోన్ల రిటైలర్ నికుంజ్ పటేల్ అన్నారు. ఆయన ఫోన్బుక్ పేరుతో గుజరాత్లో 45 స్టోర్లను నిర్వహిస్తున్నారు. తమ స్టోర్లలో హైఎండ్ ఫోన్ల సేల్స్ ఈ ఏడాది15 శాతం పెరిగాయని చెప్పారు. కేవలం గుజరాత్లో మాత్రమే కాదు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, కేరళ మార్కెట్లలోని చిన్న పట్టణాల్లో హైఎండ్ ఫోన్లను చాలా మంది కొంటున్నారని ప్రిడిక్ట్వ్యూ తెలిపింది. ఈ విషయమై మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ 2019తో పోలిస్తే ప్రీమియం, మిడ్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లకు డిమాండ్ 50 శాతం పెరిగిందని వెల్లడించారు. ఫోన్లకు ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి చాలా మంది రెడీ అవుతున్నారని, అందుకే డిమాండ్ పెరుగుతోందని వివరించారు.