వచ్చే రెండు వారాల్లో అంటే.. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు.. 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే సంచలన విషయాన్ని ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఏప్రిల్ 12వ తేదీ బుధవారం.. దేశంలో కరోనా కేసులపై రివ్యూ నిర్వహించిన తర్వాత.. ఈ మేరకు అంచనాకు వచ్చారు అధికారులు. 11వ తేదీ ఒక్క రోజే అత్యధికంగా 7 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంపై సుదీర్ఘంగా చర్చించారు అధికారులు.
వచ్చే రెండు వారాల్లో భారీగా కేసులు ఎందుకు పెరుగుతాయి అనే విషయాన్ని కూడా వివరించారు. కొత్త వేరియంట్ XBB.1.16 కారణంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనా ఎండమిక్ దశలో ప్రవేశిస్తుందని, వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని తెలిపింది. ఆ తరువాత కేసులు తగ్గుతాయని అంచనా వేసింది.
అటు దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. గతేడాది ఆగస్టు తరువాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.