- 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రూ.3.29 కోట్లు సీజ్
- పరారీలో ప్రధాన ఆర్గనైజర్లు
గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఐదు గ్యాంగ్లను మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.29 కోట్ల నగదు, తదితర వస్తువులను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి బాలాజీ నగర్కు చెందిన సురేశ్ (42) ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని మాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సురేశ్ ఇచ్చిన సమాచారంతో వికారాబాద్కు చెందిన పంటర్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు రామాంజనేయులు పరారీలో ఉన్నాడని రామకృష్ణ తెలిపాడు. సురేశ్, రామకృష్ణ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.79.99 లక్షలను పోలీసులుచేశారు. అలాగే రూ.1.90 లక్షల విలువైన సెల్ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట గ్రామంలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న చిన్నబాబు, కరీముల్లా, వెంకటేశ్, రమేష్ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.21 లక్షలు సీజ్ చేశారు. నగదుతో పాటు రూ.4.84 లక్షల విలువైన స్మార్ట్ఫోన్లు, రెండు ల్యాప్ట్యాప్లు, కీప్యాడ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాకి చెందిన ప్రధాన నిర్వాహకుడు కల్యాణ్ పరారీలో ఉన్నాడు.
మాదాపూర్ జోన్లో
మియాపూర్లో ఓ అపార్ట్మెంట్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అదే అపార్ట్మెంట్లో నివాసం ఉండే వీర శంకర్చారి, కేపీహెచ్ బీ కాలనీకి చెందిన రాంప్రసాద్రెడ్డి, బోడుప్పల్కు చెందిన మురళి, గాజుల రామారానికి చెందిన వంశీకృష్ణ ఆర్గనైజర్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారి వద్ద నుంచి రూ.1.44 కోట్ల డబ్బును సీజ్ చేశారు. రూ.80 లక్షల విలువైన కమ్యూనికేషన్ బోర్డులు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, బెంజ్ కారు, స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
మెయిన్ ఆర్గనైజర్లుగా ఉన్న బెంగుళూరుకు చెందిన రాజేష్రెడ్డి, గచ్చిబౌలికి చెందిన సురేష్రెడ్డి, అనంతపురానికి చెందిన నాగార్జునరెడ్డి, కూకట్పల్లికి చెందిన సాదిక్ పరారీలో ఉన్నారు. అలాగే బాలానగర్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన అజయ్కుమార్, మహేష్ కుమార్ నుబాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ ఆర్గనైజర్ నరేష్ పరారీలో ఉన్నాడని నిందితులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.93 వేల నగదు సీజ్ చేశారు. రూ.లక్ష విలువైన రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బాచుపల్లిలో ముగ్గురు బుకీలు..
బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు బుకీలను బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బాచుపల్లి సాయినగర్కు చెందిన శ్రీకాంత్ రెడ్డి, నిజాంపేట శ్రీనివాస్నగర్కు చెందిన అల్లీ లోకేష్, బాచుపల్లి సాయినగర్కు చెందిన వెంకట సునీల్గా గుర్తించారు. నిందితులను విచారించగా ప్రధాన ఆర్గనైజర్లు నీలేష్, బుద్దారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13.30 లక్షలు సీజ్ చేశారు. అలాగే రూ.1.83 లక్షల విలువైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, కీప్యాడ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.