- యూత్, కుటుంబాల్లో బెట్టింగ్ ల చిచ్చు
- అప్పులు, లోన్లు తీర్చలేక ఆర్థికంగా కష్టాలు
- బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నా.. కొత్తగా వందల్లో పుట్టుకొస్తున్నయ్
హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన్ బెట్టింగ్ లు యువత, కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నాయి. బెట్టింగ్ ల కోసం అప్పులు చేస్తూ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద అప్పులే కాకుండా ఆన్లైన్లోనూ యాప్ లోన్లు తీసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో రూ. లక్షల్లో నష్టపోతున్నారు. చివరకు తీర్చలేక చావుదాకా తెచ్చుకుంటున్నారు. క్రికెట్బెట్టింగ్ మాత్రమే కాదు. ఎలక్షన్స్, కబడ్డీ, సినిమా కలెక్షన్స్.. ఇలా సీజన్ను బట్టి బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్ ల్లో డబ్బులు కోల్పోయిన బాధితులు పరువుపోతుందనే భయంతో బయటకు చెప్పుకోవడంలేదు. పోలీసులకు కూడా కంప్లయింట్ చేయడంలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడే ఇలాంటివి బయటకు వస్తున్నాయి.
అప్పులు, లోన్లు తీసుకుంటూ..
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్కావడంతో జోరుగా క్రికెట్ బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు అధికంగా డబ్బులు రావడంతో... అత్యాశకు పోయి భారీ మొత్తంలో బెట్టింగ్పెట్టి నష్టపోతున్నారు. అప్పులు, అధిక వడ్డీలకు ఆన్లైన్లో లోన్లు తీసుకుని పెడుతున్నారు. టైమ్కు ఈఎంఐలు చెల్లించలేకపోతుండగా లోన్ యాప్నిర్వాహకులు పెట్టి వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోన్ యాప్స్నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్యాప్స్పై నిషేధం ఉన్నా కూడా రోజుకు వందల్లో యాప్స్పుట్టుకొస్తున్నాయి. యూ ట్యూబ్, సోషల్మీడియా, వెబ్సైట్లలో వంద పెడితే వెయ్యి అంటూ బెట్టింగ్యాప్స్ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆశ పెట్టి చివరకు జనాల జేబులకు చిల్లుపెడుతున్నాయి. వన్ ఎక్స్ బెట్, మెగాపరి, మేట్బెట్, బెట్365, డఫ్పా బెట్లాంటి వెబ్సైట్స్, యాప్స్లో ప్రస్తుతం బెట్టింగ్జోరుగా నడుస్తుంది. సాధారంగా ఆన్లైన్ బెట్టింగ్స్లో నష్టపోయిన బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయడంలేదు. ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల దృష్టికి వెళ్లిన సైట్లను మాత్రమే బ్లాక్ చేస్తున్నారు.
మియాపూర్ లో నలుగురు బెట్టింగ్ బుకీలు అరెస్ట్
మియాపూర్: ఐపీఎల్ క్రికెట్మ్యాచ్ లపై బెట్టింగ్నిర్వహిస్తున్న నలుగురు బుకీలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలోని శ్రీనిధి సర్వీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్505లో క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్నారని బుధవారం పోలీసులకు సమాచారం అందింది. మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు కలిసి రైడ్చేసి, ఏపీలోని గుంటూరుకు చెందిన అల్లూరు త్రినాథ్(34), మనం రాజేశ్(33), బోలే స్వామి(30), మార్పెన్న గణపతి(57)ని అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురు బుకీలుగా వ్యవహరిస్తూ.. ఆన్లైన్లో క్రికెట్ లైవ్ గురూ, లక్కీ యాప్ల ద్వారా ఐపీఎల్మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరి నుంచి రూ.40 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్కు వినియోగిస్తున్న అకౌంట్లలోని రూ.3లక్షల57వేల461 ఫ్రీజ్చేశారు. 8 స్మార్ట్ ఫోన్లు, 2 కిప్యాడ్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్స్, 2 ట్యాబ్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు నర్సరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు అలియాస్ చిన్ను అనే వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు.
కంప్లయింట్ వస్తే బ్లాక్ చేస్తున్నాం
క్రికెట్ బెట్టింగ్స్ పై యాప్స్, వెబ్సైట్స్చాలా వస్తున్నాయి. మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే బ్లాక్ చేస్తున్నాం. మళ్లీ వేరే పేర్లతో లింక్స్, యాప్స్క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటివాటిపై ప్రజలు కూడా అవేర్ నెస్తో ఉండాలి. ఈజీ మనీ అంటేనే మోసపోతామని గుర్తించాలి.
– శివ మారుతి, ఏసీపీ, సైబర్ క్రైమ్ హైదరాబాద్