- సైబర్ మోసాలు ఏటా రూ.500 కోట్లు
- రాష్ట్రంలో బాధితుల సంఖ్య లక్షల్లో
- గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 64 వేల ఫిర్యాదులు
- 4 ఏండ్లలో 350 % పెరిగిన క్రైమ్స్
- రూ.లక్షకు పైగా మోసం జరిగితేనే కేసు నమోదు
- పోలీసులకు సవాలుగా నేరాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం సైబర్ మోసాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఏటా రూ.500 కోట్లకు పైగా కొల్లగొడుతూ సైబర్ నేరగాళ్లు రాష్ట్ర పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రోజూ 150 దాకా సైబర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఒక్క ఏడాదిలో సైబర్ నేరాల్లో మోసపోయామంటూ కాల్ సెంటర్కు లక్షా 36 వేల కాల్స్ వచ్చాయంటేనే ఈ నేరాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో స్పష్టం అవుతుంది. కాల్స్ చేసిన వారిలో 64 వేల మంది ఫిర్యాదు చేశారు. ఈ నేరాల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్లో ఏటా రూ.450 కోట్ల మేర కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో మరో రూ.100 కోట్ల వరకు మోసాలు జరుగుతున్నాయి. నిరుడు రాష్ట్రంలో 8,839 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.లక్షకు పైగా మోసం జరిగిన ఘటనల్లోనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తున్న 1,930 కాల్ సెంటర్కి ఏటా లక్షల సంఖ్యలో కాల్స్ వస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఈనెల 19 వరకు మొత్తం 1,36,139 కాల్స్ వచ్చాయి. ఇందులో 64,034 మంది కంప్లైంట్స్ చేశారు. ఈ బాధితుల నుంచి నేరగాళ్లు రూ.310 కోట్ల 80 లక్షలు కొట్టేశారు. ఇందులో పోలీసులు రూ.25,94,61,955 ఫ్రీజ్ చేశారు.
పెరిగిన టెక్నాలజీతో
పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ఫోన్లు వచ్చాయి. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డాటా, లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు నగదుతో పనిలేకుండానే డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. డిజిటల్ బ్యాంకింగ్, ఈ కామర్స్ సైట్లను టార్గెట్ చేసి అందినంత దోచేస్తున్నారు. లింక్స్ పంపండం, స్మార్ట్ ఫోన్స్ హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, విషింగ్ మెయిల్స్తో బ్యాంక్ ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు. ఓఎల్ఎక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా ఇతర ఈ కామర్స్ సైట్స్ అడ్డాగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మూడేండ్లలో ఐదు రెట్లు పెరినయ్.
దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతున్నాయి. డార్క్వెబ్ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్ నంబర్స్, ఏజెన్సీల ద్వారా సేకరించిన బ్యాంక్ ఖాతాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అంటూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కు పాల్పడుతున్నారు. 2018 నుంచి 2021 మధ్య కాలంలో ఐదు రెట్లు సైబర్ నేరాలు పెరిగినట్లు ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.ఈ క్రమంలోనే 2018తో పోల్చితే గ్రేటర్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో గతేడాది వరకు 350 శాతం అధికంగా సైబర్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి.
స్మార్ట్ ఫోన్ ఆధారంగానే
లక్షల సంఖ్యలో మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఏటా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం కేసులు స్మార్ట్ఫోన్ ఆధారంగా జరుగుతున్న మోసాలే ఉంటున్నాయి. గుర్తు తెలియని లింక్స్తో నెటిజన్లు హ్యాకింగ్, డేటా చోరీకి చేస్తున్నారు. ఓటీపీ ఫ్రాడ్స్, డెబిట్ కార్డ్స్ క్లోనింగ్, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు ఫేక్ కాల్సెంటర్స్తో ఖాతాల్లో సొమ్ము కొల్ల గొడుతున్నారు.
లోన్, క్రిప్టో కరెన్సీ పేరుతో 66 లక్షల మోసం
లోన్ ఇప్పిస్తామని, క్రిప్టో కరెన్సీతో భారీ లాభాలంటూ ముగ్గురిని ట్రాప్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.66 లక్షలు కాజేశారు. టాటా క్యాపిటల్ లోన్ ఇప్పిస్తామంటూ చార్మినార్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్, సర్వీస్ చార్జ్ల పేరుతో మూడు నెలల్లో రూ.18.50 లక్షలు దోచేశారు. ఇంకా చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ను బాధితుడు ఆశ్రయించాడు. ఓల్డ్ బోయిగూడ, రాంనగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులకు క్రిప్టో కరెన్సీతో భారీ లాభాలంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లింక్ పంపారు. ఓల్డ్ బోయిగూడకు చెందిన వ్యక్తి నుంచి రూ.40 లక్షలు, రాంనగర్కు చెందిన వ్యక్తి నుంచి రూ.7.73 లక్షలు వసూలు చేశారు. బాధితులు మోసపోయామని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.