- ఎస్పీ సునీతరెడ్డి
వనపర్తి, వెలుగు : అందరి సహకారంతోనే సైబర్ నేరాలకు ఫుల్స్టాప్ పెట్టవచ్చని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. సైబర్నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ ప్రపంచంలో మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుందన్నారు. అవగాహనే ఆయుధంగా ప్రతిఒక్కరూ సైబర్ వారియర్ కావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సైబర్నేరానికి గురైతే వెంటనే1930 హెల్ప్లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ’సైబర్ భద్రత ప్రతిజ్ఞ’ చేయించి పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చెక్ పోస్టులు నిఘా కేంద్రాలుగా పనిచేయాలి
గోపాల్ పేట, వెలుగు : అక్రమ నగదు, -మద్యం రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టులు నిఘా కేంద్రాలుగా పనిచేయాలని ఎస్పీ సునీతరెడ్డి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం గోపాలపేట్ పోలీ స్టేషన్ పరిధిలోని బుద్దారం చెక్ పోస్ట్ను ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను అరికట్టాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
