ఖజానా రాబరీ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్

ఖజానా రాబరీ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్
  • గుజరాత్​లోని అంకలేశ్వర్​ వద్ద పట్టుకున్న పోలీసులు
  • సహకరించిన ముగ్గురు, మరో నిందితుడు పరారీలోనే..
  • వివరాలు వెల్లడించిన సీపీ అవినాష్​ మహంతి

గచ్చిబౌలి, వెలుగు: చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును సైబరాబాద్​ పోలీసులు చేధించారు. తాజాగా మరో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్​ చేశారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. వీరి నుంచి 1,915 గ్రాముల బంగారు పూత ఉన్న వెండి ఆభరణాలు, ఒక పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్​కమిషనరేట్​లో మాదాపూర్​ డీసీపీ డా. వినీత్​తో కలిసి సీపీ అవినాష్​ మహంతి శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న ఆరుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి చందానగర్​ గంగారంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న ఖజానా జ్యువెలరీలోకి చొరబడ్డారు. 

కత్తులతో  జ్యువెలరీ సిబ్బందిని బెదిరించారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్​ కీ ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్​సతీశ్​కుమార్​పై కాల్పులు జరిపారు. అనంతరం డిస్​ప్లేలలో ఉన్న 10 కేజీల బంగారు పూత పూసి ఉన్న వెండి ఆభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకొని అక్కడి రెండు బైకులపై పటాన్​చెరు వైపు పరారయ్యారు. ఈ దోపిడీపై చందానగర్​ పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. మహరాష్ట్ర, కర్నాటక, బీహార్​ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. 

ఈ నెల 15న పుణెలోని జెజురి ప్రాంతంలో అశీశ్​కుమార్​సింగ్, దీపక్ కుమార్​షాను అదుపులోకి తీసుకున్నారు. 19న పుణెలోని పింప్రి వద్ద అనిశ్​కుమార్​సింగ్, ప్రిన్స్​కుమార్​రజాక్​అరెస్ట్​ చేశారు. తాజాగా శనివారం ఈ దోపిడీ కేసులో ప్రధాన నిందితులు ప్రిన్స్​ కుమార్​భారతి, రోహిత్​కుమార్​రజాక్​ను గుజరాత్​లోని 
అంకలేశ్వర్​ ప్రాంతంలో సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.  

మూడు గంటల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేశారు..

దోపిడీ తర్వాత ఆరుగురు నిందితులు రెండు బైక్​లపై పటాన్‌చెరు వైపు పారిపోయి, మూడు గంటల్లోనే రాష్ట్ర సరిహద్దులు దాటేసినట్లు సీపీ తెలిపారు. ఒక బైక్‌ను బీదర్​లో, మరొకటి పుణెలో వదిలేసి వేర్వేరుగా పరారయ్యారు. ఈ దోపిడీకి ప్రిన్స్‌ కుమార్‌ భారతి స్కెచ్ వేశాడు.  ప్రిన్స్​ఇప్పటికే ఆర్మ్స్‌ యాక్ట్‌, దోపిడీ, ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో నిందితుడిగా ఉండగా, రెండు కేసుల్లో పరారీలో ఉన్నాడు. రోహిత్‌ కుమార్‌ రజాక్‌ బీహార్​లో ఆర్మ్స్‌ యాక్ట్‌, దోపిడీ కేసుల్లో నిందితుడు ఉన్నారు. వీరిద్దరిని నుంచి త్వరలోనే గన్స్​, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని సీపీ తెలిపారు. ఈ దోపిడిలో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరికి సహకరించిన మరో ముగ్గురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు.