మహబూబ్నగర్, వెలుగు: డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించగా, రెండు జిల్లాలకు పాత వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్ కు అవకాశం దక్కింది.
జోగులాంబ గద్వాల అధ్యక్షుడిగా యువ నాయకుడు రాజీవ్ రెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. వనపర్తి జిల్లా అధ్యక్ష పదవిని యూత్ లీడర్ శివసేనా రెడ్డికి అప్పగించింది. ఇక నారాయణపేట, నాగర్ కర్నూల్ లో పాతవారినే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొనసాగనున్నారు.
