పెట్రోల్ ​బంకుల్లో డీలర్ల చేతివాటం!.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పెట్రోల్ ​బంకుల్లో డీలర్ల చేతివాటం!.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
  • రిమోట్ ద్వారా పెట్రోల్, డీజిల్ కొలతల ఆపరేట్  
  • సిటీలోని పలు బంకుల్లో  కొందరు డీలర్ల మోసాలు 
  • సివిల్​ సప్లయ్ ​ఎన్ ఫోర్స్​మెంట్ తనిఖీల్లో వెలుగులోకి.. 
  • నాసిల్స్​కు కూడా స్టాంపింగ్​చేయించని నిర్వాహకులు 


హైదరాబాద్,వెలుగు : సిటీలో కొందరు పెట్రోల్​బంకుల డీలర్లు చేతివాటం చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొడుతున్నారు. బంకుల్లోని డిస్పెన్సర్​మెషీన్లకు ఉండే నాసిల్స్​(గన్)కు స్టాంపింగ్ అప్ డేట్ చేయించడం లేదని తేలింది. ఇటీవల సివిల్​సప్లయ్ డిపార్ట్ మెంట్ స్పెషల్​డ్రైవ్​లో ఇలాంటి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రతి పెట్రోల్​బంకులోని మెషీన్లకు నాసిల్స్(గన్​)​ అమర్చి వాటి ద్వారానే వాహనాలకు పెట్రోల్, డీజిల్​పోస్తుంటారు. ఆ నాసిల్స్ కు ప్రతి ఏడాది తూనికలు కొలతల శాఖ ద్వారా అప్ డేట్ స్టాంపింగ్​చేయించాలి. అలా చేయించాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. దీంతో స్టాంపింగ్​చేయించకుంటే పెట్రోల్, డీజిల్​పోసేటప్పుడు కొలతల్లో తేడా వస్తుంది. మరోవైపు కొందరు డీలర్లు డిస్పెన్సర్ మెషీన్ లో చిప్​ను అమర్చుతున్నారు. రిమోట్ ను చేతి​ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. దీంతో కూడా కస్టమర్లకు పోసే పెట్రోల్, డీజిల్​కొలతల్లో  తేడా వస్తుంది. తనిఖీల్లో మెషీన్ లో చిప్​ఏర్పాటు చేయడం, మరికొన్ని కేసుల్లో నాసిల్స్​కు స్టాంపింగ్​చేయించకపోవడం వంటి అక్రమాలు బయటపడుతున్నట్టు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. వాహనదారుల కంటికి కనిపించకుండా కొందరు డీలర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. 

అప్ డేట్ చేయించకుండా అక్రమాలు

 కొందరు పెట్రోల్​బంకుల నిర్వాహకులు మెషీన్లలో చిప్​పెట్టి రిమోట్​ద్వారా ఆపరేట్​చేస్తూ వాహనదారులను మోసగిస్తున్నారు. నాసిల్​ద్వారా పెట్రోలు, డీజిల్ పోసేటప్పుడు మెషీన్ నెంబర్లు చాలా స్పీడ్ గా తిరుగుతుంటాయి. అప్పటికే మెషీన్ లో అమర్చిన రిమోట్ ను నిర్వాహకులు చేతితో ఆపరేట్​చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్​కొలతల్లో తేడా వస్తుంది.  ప్రతి ఏడాది నాసిల్స్​కు స్టాంపింగ్​అప్ డేట్ చేయించకపోగా టెక్నికల్​గా టాంపరింగ్​చేస్తున్నట్టు తెలిసింది. కొందరు నాసిల్​కు ఉండే ప్లాస్టిక్​ముద్రను తొలగిస్తుండగా.. తద్వారా టాంపర్​అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అక్రమాలతో వాహనదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని సివిల్​సప్లయ్ ఎన్​ఫోర్స్​మెంట్​డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్​పేర్కొన్నారు. స్పెషల్​డ్రైవ్​లో చాలా బంకుల్లో నాసిల్​స్టాంపింగ్​చేయనివే ఎక్కువగా బయటపడుతున్నాయని తెలిపారు. ఇటీవల బీఎన్​రెడ్డి నగర్​లో స్టాంపింగ్​చేయని మూడు పెట్రోల్​బంకులపై కేసు నమోదు చేసినట్టు, మరికొందరికి షోకాజ్​నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పారు.  

 రోజుకు లక్షల లీటర్ల అమ్మకాలు 
 
సిటీలో పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను అరికట్టడడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని, ఇందుకు బంకుల నిర్వాహకులతో ములాఖత్ అయి ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిటీలో నాసిల్​స్టాంపింగ్​చేయించుకోని బంకులపై కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. సివిల్​సప్లయ్​ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నా.. కేవలం వార్నింగ్​లతోనే  సరిపెడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో 850 పెట్రోల్​బంకులు ఉన్నాయి. ఘట్​కేసర్​, చర్లపల్లి తదితర ఆయిల్​కంపెనీల డిపోల నుంచి రోజుకు 20లక్షల లీటర్ల పెట్రోల్, మరో 20 లక్షల లీటర్ల డీజిల్ ను సరఫరా చేస్తున్నారు. డీలర్లకు కమీషన్​ వస్తున్నా కూడా అక్రమాల ద్వారా కూడా కొందరు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. 

తమిళనాడు విధానం అమలు చేస్తే..  

పెట్రోల్ బంకుల నిర్వాహకులు నాసిల్​స్టాంపింగ్ చేయించకుండా ​ఫీజును ఎగ్గొడుతున్నారని తమిళనాడులో నేరుగా ఆయిల్​కంపెనీలే  ఫీజులను చెల్లిస్తాయి. ఆ తర్వాత డీలర్ల నుంచి తిరిగి పొందే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి విధానమే తెలంగాణలోనూ అమలు చేస్తే నాసిల్​స్టాంపింగ్ ఫీజును ఎగ్గొట్టడానికి చాన్స్ ఉండదని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. రిమోట్ చిప్​లను ఏర్పాటు చేసి పెట్రోల్, డీజిల్​కొలతల్లో  అక్రమాలకు పాల్పడే నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.