
- రూ.17.57 లక్షల కోట్లకు పెరిగిన ఏయూఎం
- 79.36 లక్షలకు చేరిన ఇన్వెస్టర్ల సంఖ్య వెల్లడించిన యాంఫీ
న్యూఢిల్లీ: డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో గత నెల భారీ రికవరీని సాధించాయి. గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు ఏప్రిల్లో రూ.2.19 లక్షల కోట్లు మదుపు చేశారు. ఈ ఏడాది మార్చిలో రూ.2.02 లక్షల కోట్ల ఔట్ఫ్లోల తర్వాత ఈ రికవరీ వచ్చింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులు, బ్యాలెన్స్ షీట్ సర్దుబాట్ల కోసం లిక్విడిటీని కోరుకునే సంస్థాగత పెట్టుబడిదారులు గత నెల భారీగా ఇన్వెస్ట్చేశారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్, సీనియర్ ఎనలిస్ట్ నేహల్ మెష్రామ్ అన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో డెట్ఫండ్స్ నుంచి రూ.6,525 కోట్ల ఔట్ఫ్లో ఉండగా, జనవరిలో రూ.1.28 లక్షల కోట్ల ఇన్ఫ్లో ఉంది. తాజా ఇన్ఫ్లో వల్ల డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) అంతకుముందు నెలలో రూ.17.02 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్లో రూ.17.57 లక్షల కోట్లకు పెరిగిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) తెలిపింది. పెట్టుబడిదారుల సంఖ్యా గణనీయంగానే పెరిగింది. మార్చిలో ఫోలియోల సంఖ్య 68.91 లక్షల నుంచి ఏప్రిల్లో 1.44 లక్షలు పెరిగి 79.36 లక్షలకు చేరుకుంది.
12 ఫండ్లలో ఇన్ఫ్లో
16 డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీల్లో 12 నికర ఇన్ఫ్లో ఉంది. 16 కేటగిరీల్లో లిక్విడ్ ఫండ్లు అత్యధికంగా రూ.1.18 లక్షల కోట్ల నికర ఇన్ఫ్లోలను సాధించాయి. ఓవర్నైట్ ఫండ్స్ మనీ మార్కెట్ ఫండ్స్ మార్చిలో రూ. 23,900 కోట్లు, ఏప్రిల్లో రూ. 31,507 కోట్లు ఆకర్షించాయి. అల్ట్రా-షార్ట్ లో-డ్యూరేషన్ ఫండ్స్కూ భారీగానే డబ్బులు వచ్చాయి. ఇవి వరుసగా రూ. 26,734 కోట్లు రూ. 9,371 కోట్లు సేకరించాయి. అయితే, గిల్ట్ ఫండ్స్లో రూ. 425 కోట్ల వరకు ఔట్ఫ్లో ఉంది.
క్రెడిట్ రిస్క్ ఔట్ఫ్లో రూ. 302 కోట్లు, గిల్ట్ ఫండ్ డైనమిక్ బాండ్ ఫండ్స్లో వరుసగా రూ. 39 కోట్లు, రూ. 10 కోట్ల ఔట్ఫ్లో ఉంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏప్రిల్లో రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. మార్చి క్వార్టర్లో ముగింపులో రూ.1.64 లక్షల కోట్ల ఔట్ఫ్లో ఉంది. దీంతో ఇండస్ట్రీ ఏయూఎం విలువ మార్చి-ముగింపులో రూ.65.74 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయిలో రూ.70 లక్షల కోట్లకు పెరిగింది.