- 2024లో 40 శాతం తక్కువ జాబ్స్
గత ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐటీ కంపెనీలు 2.40 లక్షల జాబ్స్ ఇచ్చాయి. ఈసారి వీటి సంఖ్య 50 వేల నుంచి లక్షకు పడిపోతుందని అంచనా. జూన్ క్వార్టర్లో భారతదేశ టాప్ ఫైవ్ ఐటీ కంపెనీల్లో నికర ఉద్యోగుల సంఖ్య 21,838 తగ్గింది. ఒక్క టీసీఎస్ మాత్రమే 500 మందిని నియమించింది. మిగతా నాలుగు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరగలేదు.
న్యూఢిల్లీ: మనదేశంలోని పెద్ద ఐటీ కంపెనీలు నియమకాలను తగ్గించేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి దాదాపు 40శాతం తక్కువ జాబ్స్ ఇస్తాయని అంచనా. డిమాండ్పై స్పష్టత లేకపోవడం, టెక్నాలజీ సర్వీసుల్లో మందగమనం, గ్లోబల్ మార్కెట్లలో ఇబ్బందుల కారణంగా ఇవి జాబ్స్ఇవ్వడానికి ఉత్సాహం చూపడం లేదు. స్టాఫింగ్ సంస్థ ఫెనో నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఐటీ సేవల మేజర్లు 2024 ఆర్థిక సంవత్సరంలో 50 వేల నుంచి లక్ష మంది ఉద్యోగులను నియమించుకోవచ్చని అంచనా. మునుపటి సంవత్సరంలో ఈ కంపెనీలు 2.50 లక్షల మందికి జాబ్స్ ఇచ్చాయి.
ఈ లెక్కలను పోల్చిచూస్తే ఐటీ సెక్టార్లో హైరింగ్ ఎంత దారుణంగా పడిపోతోందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో టాప్ ఐదు ఐటీ ఎగుమతిదారులు - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా- నికర హెడ్ కౌంట్ 21,838 తగ్గింది. పరిశ్రమలో నంబర్వన్గా ఉన్న టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య ఈ క్వార్టర్లో సుమారు 500 పెరగగా, మిగిలిన నాలుగు కంపెనీల్లో మాత్రం గణనీయంగా తగ్గాయి.
గ్లోబల్ మార్కెట్లలో ఎదురుగాలులు
యూఎస్, యూరప్ మార్కెట్లలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఐటీలో నియామకాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీ సర్వీసుల్లో జాబ్స్ 25–-30 శాతం తగ్గవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శివరామ్ అన్నారు. ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వకపోవచ్చని అంచనా వేశారాయన. తాజా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు డిమాండ్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ నాటికి పుంజుకోవచ్చని అన్నారు. అప్పటికి డిమాండ్ కరోనా ముందు స్థాయికి దగ్గరగా ఉంటుందని వివరించారు.
టీసీఎస్తో పాటు, ఐటీ కంపెనీలు ఈ సంవత్సరం 40 వేల మందిని తీసుకుంటాయని అంచనా. అయితే కంపెనీలు మాత్రం హైరింగ్ ప్లాన్ల గురించి ఏమీ మాట్లాడటం లేదు. విప్రో మొదటి క్వార్టర్లో ఫ్రెషర్లను తీసుకోలేదని కంపెనీ హెచ్ఆర్ చీఫ్ సౌరభ్ గోవిల్ తెలిపారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సమస్యలు యూఎస్, యూరప్ ఎదుర్కొంటున్న స్థూల సవాళ్లను తీవ్రతరం చేశాయి. ఇవి రెండూ- భారతీయ ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లు. కొన్ని ఐటీ కంపెనీల జూన్ క్వార్టర్ ఆదాయాల్లో తగ్గుదల కనిపించింది. ఈ లిస్టులో టీసీఎస్ కూడా ఉంది.
భారతదేశపు రెండవ- అతిపెద్ద ఐటీ సేవల మేజర్, ఇన్ఫోసిస్, రెవెన్యూ గ్రోత్ గైడేన్స్ను పూర్తి సంవత్సరానికి నిలకడైన కరెన్సీలో 1-–3.5 శాతంకి తగ్గించింది. దాని మునుపటి అంచనా 4–7శాతం ఉండేది. ప్రాజెక్ట్ ర్యాంప్డౌన్ల కారణంగా ప్రాఫిట్, రెవెన్యూ ఎస్టిమేట్స్ను చేరుకోలేకపోయింది. టెక్నాలజీ, టెలికాం వర్టికల్స్ నిరాశపర్చాయి. టెక్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీపీ గుర్నానీ మాట్లాడుతూ ఏప్రిల్–-జూన్ గత ఐదేళ్లలో తాను చూసిన కఠినమైన క్వార్టర్లలో ఒకటి అని అన్నారు. ప్రస్తుత సవాళ్లు "తాత్కాలికమైనవి" అని ఆయన కామెంట్ చేశారు.
మిగతా కంపెనీలు కూడా..
భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ ఐటీ మేజర్లు కూడా ఇటీవలి క్వార్టర్లో ఒక్కొక్కటి 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. దీనిపై టీమ్లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మాట్లాడుతూ, "ఐటీ సేవల నియామకానికి ఇది చెడ్డ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. నిరాశాపూరిత సెంటిమెంట్ ఇక ముందు కూడా కొనసాగుతుందని అంచనా.
సెక్టార్ గ్రోత్ పెరుగుతుందన్న సూచనలు లేవు. కొత్త ప్రాజెక్ట్ల రోల్ అవుట్పై స్పష్టత కొరవడటంతో కంపెనీలు తాజా నియామకాల కోసం తొందరపడటం లేదు” అని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం నుంచి నికర నియామకాలు 40 శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టు నాటికి కొత్త నియామకాల అవసరం దాదాపు 50శాతం తగ్గిందని సునీల్ వివరించారు.