
ఏఐ మనల్ని అపరిమితమైన ఆశావాదంతో నింపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా వంటి రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని మేం ఊహించాం. అయితే, ఈ ఆశాజనకమైన సాంకేతికతకు ఒక చీకటి కోణం కూడా ఉందని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇది కేవలం వ్యక్తిగత మోసాల గురించి కాదు. ఇది నిజానిజాలను గుర్తించే సామర్థ్యానికి ముప్పు. భారతదేశంలో, డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం ఒకవైపు అవకాశాలను తెస్తుంటే, మరోవైపు కృత్రిమ మేధస్సు (ఏఐ) దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న సవాళ్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా ‘అసభ్యకర డీప్ఫేక్’లు సమాజానికి పెను ముప్పుగా మారాయి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు పరిమితమైన ఈ సాంకేతికత ఇప్పుడు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. డీప్ఫేక్లు అంటే ఏఐ ఉపయోగించి సృష్టించిన నకిలీ ఫొటోలు, వీడియోలు లేదా ఆడియోలు. వీటిలో ఒక వ్యక్తి ముఖాన్ని లేదా శరీరాన్ని మార్చడం, ఒకరి వాయిస్ను అనుకరించడం వంటివి జరుగుతాయి. ఈ సాంకేతికత వినోదం కోసం ఉపయోగిస్తున్నప్పటికీ దీనికి ఒక చీకటి కోణం ఉంది. ప్రజలను నమ్మించి, వారిని మోసం చేసేవిధంగా అభ్యంతరకరమైన లేదా లైంగిక అసభ్యకరమైన ఏఐ కంటెంట్ను తయారు చేయడం నేడు ఒక తీవ్రమైన సమస్యగా మారింది.
ఈ డీప్ఫేక్లలో వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను, అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. ఈ రకమైన కంటెంట్ బాధితుల గౌరవానికి తీవ్రంగా భంగం కలిగించడమే కాకుండా, వారి కెరీర్ను వ్యక్తిగత జీవితాలను నాశనం చేయగలదు. నిమిషాల్లో లక్షలాది మందికి చేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఈ డీప్ఫేక్ల వ్యాప్తికి వేదికలవుతున్నాయి. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని తయారుచేసిన డీప్ఫేక్ వీడియో, ఆ వ్యక్తి జీవితాన్ని శాశ్వతంగా దెబ్బతీయగలదు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు కూడా ఈ బెదిరింపునకు గురవుతున్నారు.
ఉదాహరణకు, ఇటీవల ప్రముఖ నటీమణుల డీప్ఫేక్ వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి, ఇది దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది. 2023లో ఏఐ దుర్వినియోగం, ముఖ్యంగా డీప్ఫేక్లు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం సైబర్ నేరాల నివేదన ప్లాట్ఫామ్లలోనే డీప్ఫేక్ ఫిర్యాదులు 2022తో పోలిస్తే 2023లో 800% పెరిగాయని కొన్ని పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. ఈ గణాంకాలు సమస్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
భారతీయ న్యాయ వ్యవస్థలో చర్చ
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డీప్ఫేక్ వీడియోల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టడానికి భారతీయ న్యాయ వ్యవస్థలో ఉన్న నిబంధనలు, రాబోయే మార్పులపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న న్యాయ సంహిత, 2023 డీప్ఫేక్ల విషయంలో ఏఐ -సృష్టించిన కంటెంట్ను నేరుగా పరిష్కరించడంలో స్పష్టతను కోల్పోతున్నాయి. భారతదేశంలో డీప్ఫేక్లు, ఏఐ దుర్వినియోగానికి సంబంధించి ప్రత్యేకమైన, సమగ్రమైన చట్టాలు లేనప్పటికీ ప్రస్తుత చట్టాలు ఈ దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడతాయి.
సమాచార సాంకేతిక చట్టం, 2000 (IT Act, 2000) డిజిటల్ నేరాలను పరిష్కరించడానికి ఉద్దేశించింది. ఈ చట్టంలోని సెక్షన్ 66C డీప్ఫేక్ అంటే గుర్తింపు దొంగతనాన్ని శిక్షిస్తుంది. సెక్షన్ 66D కంప్యూటర్ వనరులను ఉపయోగించి నకిలీ గుర్తింపుతో మోసం చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా, సెక్షన్లు 67, 67A ఆన్లైన్లో అశ్లీలతని ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తాయి. వీటి కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. అసభ్యకర డీప్ఫేక్లు ఈ సెక్షన్ల పరిధిలోకి వస్తాయి.
సెక్షన్ 67B పిల్లలను లైంగికంగా స్పష్టమైన చర్యలలో చిత్రీకరించే ఏదైనా కంటెంట్ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం నిషేధిస్తుంది. ఏఐ ద్వారా బాల్య అశ్లీలత కంటెంట్ను సృష్టించడం లేదా వ్యాప్తి చేయడం ఈ చట్టం కింద కఠినమైన చర్యలకు దారితీస్తుంది. భారతీయ న్యాయ సంహిత, 2023 సెక్షన్ 356 ప్రకారం, డీప్ఫేక్ వీడియోలు ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగిస్తే క్రిమినల్ పరువు నష్టంగా పరిగణించవచ్చు.
సెక్షన్ 294, సెక్షన్ 296 అశ్లీల ప్రచురణలను నేరంగా పరిగణిస్తుంది, ఇది డీప్ఫేక్ కంటెంట్కు కూడా విస్తరించవచ్చు. అయినప్పటికీ, ఈ చట్టాలు ఏఐ -సృష్టించిన కంటెంట్ను నేరుగా పరిష్కరించడంలో నిర్దిష్టతను కలిగి లేవు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతవేగంగా చట్టాలు మారడం లేదు.
ప్రజాస్వామ్యానికి పెను సవాలు
నైతికత లేని ఏఐ కంటెంట్ సృష్టి, సైబర్ మోసాలు మన సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి. ఈ ముప్పులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, మీడియా, పౌరుల మధ్య విస్తృత సహకారం అత్యవసరం. కేవలం చట్టాలు చేయడం లేదా సాంకేతిక పరిష్కారాలు కనుగొనడం మాత్రమే సరిపోదు. ప్రజలలో నిరంతర అవగాహన, విమర్శనాత్మక ఆలోచన, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం అత్యంత కీలకం.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) AI దుర్వినియోగం నుండి రక్షించడానికి నిరంతరం హెచ్చరికలు, సలహాలను జారీ చేస్తోంది. డీప్ఫేక్ల బారినపడిన బాధితులకు మానసిక మద్దతు, న్యాయ సహాయం అందించడానికి ఒక బలమైన మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా అవసరం. ఈ నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ చట్టాలు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి.
ఈ అంతరాన్ని పూరించడానికి త్వరలో రానున్న డిజిటల్ ఇండియా చట్టం (ఇది ఐటీ చట్టం స్థానంలోకి రావాలని భావిస్తున్నారు) ఏఐ, డేటా గోప్యత, డిజిటల్ భద్రతపై మరింత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది డీప్ఫేక్ బెడదకు అడ్డుకట్ట వేయడంలో ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందో వేచి చూడాలి.
డా.కట్కూరి
సైబర్ సెక్యూరిటీ,
న్యాయ నిపుణుడు