నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని లలితామహల్ థియేటర్ సమీపంలోని డ్రైనేజీలో సోమవారం జింక కళేబరం కనిపించింది. సుమారు ఏడాది వయస్సు ఉన్న జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి కార్పొరేటర్ ఎర్రం సుధీర్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఎవరైనా జింకను చంపి కాల్వలో పడేసి ఉండొచ్చనే అనుమానాలతో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
