న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయనను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. జైలులోని నంబర్ 2 గదిలో ప్రత్యేక సెల్ను ఆయనకు కేటాయించామని, అంతకుముందు కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించామని జైలు అధికారులు తెలిపారు. కాగా, ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సంజయ్సింగ్, విజయ్నాయర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా, మొదట 7 రోజులు, ఆపై 4 రోజులు కస్టడీకి కోర్టు అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియగా, కేజ్రీవాల్ను ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
విచారణకు సహకరించట్లే..
ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. లిక్కర్పాలసీ కేసు దర్యాప్తులో కేజ్రీవాల్ పూర్తిగా సహకరించడంలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ సీఎం పాత్రపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నదని, ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తిస్తున్నట్టు తెలిపారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తప్పించుకొనే సమాధానాలు ఇస్తున్నారని, సమాచారాన్ని దాచిపెడుతున్నారని చెప్పారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను చెప్పట్లేదని కోర్టుకు తెలిపారు. ఏదడిగినా తెలియదనే జవాబే ఇస్తున్నారని చెప్పారు.
మంత్రుల పేర్లు వెల్లడించిన కేజ్రీవాల్
ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ఎప్పుడూ తనకు రిపోర్ట్ చేయలేదని, ఏదైనా ఉంటే మంత్రులు ఆతిశీ మార్లేనా, సౌరవ్ భరద్వాజ్కు మాత్రమే నివేదించేవాడని కేజ్రీవాల్ తెలిపారన్నారు. అయితే, తాను క్యాబినెట్ మినిస్టర్స్ బంగ్లాలో ఉండి.. చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి పనిచేసినట్టు నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ వెల్లడిస్తున్నదని ఈడీ తెలిపింది. సీఎం క్యాంప్ ఆఫీస్నుంచి పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రితోకాకుండా ఇతర మంత్రులకు ఎందుకు రిపోర్ట్ చేస్తారని ఈడీ ప్రశ్నించింది. విజయ్ నాయర్ ఆప్లో ఓ చిన్న వలంటీర్ కాదని, మీడియా అండ్ కమ్యూనికేషన్కు హెడ్ అని ఈడీ పేర్కొన్నది. మద్యం తయారీదారులు, హోల్సేలర్స్, రిటైలర్స్, దినేశ్ అరోరా, అభిషేక్ బోయినపల్లిలాంటి మధ్యవర్తులతో నాయర్ 10కిపైగా సమావేశాల్లో పాల్గొన్నట్టు తెలిపే ఆధారాలను కేజ్రీవాల్కు చూపించినట్టు తెలిపింది. ఏ హోదాలో నాయర్ ఈ సమావేశాలకు హాజరయ్యారని కేజ్రీవాల్ను ప్రశ్నిస్తే, ఆయన సమాధానం దాటవేసినట్టు చెప్పింది. గోవా ఎన్నికల సమయంలో లిక్కర్ పాలసీ ప్రయోజనాలు ఆప్ పార్టీకి అందాయని సాక్ష్యాలు చూపినా.. కేజ్రీవాల్ దాటవేసే సమాధానాలే చెప్పారని పేర్కొన్నది. ఆప్లోని ఇతర సభ్యులకు సంబంధించి కేజ్రీవాల్ తప్పుడు, విరుద్ధమైన సాక్ష్యాలను అందించారని తెలిపింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అత్యంత ప్రభావశీల వ్యక్తి అని, ఆయనను లోతుగా విచారించాల్సి ఉన్నందును జ్యుడీషియల్ రిమాండ్కు పంపాలని ఎస్వీ రాజు కోరగా, 15 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జీ కావేరీ బవేజా ఉత్తర్వులు ఇచ్చారు.
ఎన్నికలు పూర్తయ్యే దాకా.. సునీత
లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేదాకా కేజ్రీవాల్ను జైలులో ఉంచడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ సీఎం భార్య సునీతా కేజ్రీవాల్ఆరోపించారు. కేజ్రీవాల్కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టునుంచి బయటకొస్తూ ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ను 11 రోజులు విచారించారు. కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించలేదు. అయినా ఎందుకు జైల్లో పెట్టారు?’ అని ప్రశ్నించారు.
జైలులో ఢిల్లీ సీఎం దినచర్య ఇదే..
తీహార్ జైలులో ఇతర ఖైదీలతోపాటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దినచర్య ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 గంటలకు నిద్ర లేస్తారు. టీ, బ్రెడ్ అల్పాహారంగా ఇస్తారు. స్నానం తర్వాత విచారణ ఉంటే కోర్టుకు లేకుంటే తన లాయర్లతో మీటింగ్లో పాల్గొంటారు. ఉదయం 10.30–11.00 గంటల మధ్య పప్పు, ఓ కూరతోపాటు అన్నం లేదా 5 రోటీలతో భోజనం అందించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తన సెల్లోనే ఉంటారు. 3.30 గంటలకు కప్పు టీ, రెండు బిస్కెట్లు తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లకు కలుసుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు డిన్నర్ చేసి, మళ్లీ రాత్రి 7 గంటలకు తన సెల్లోకి వెళతారు. వార్తలు, వినోదం, క్రీడలతో సహా 18 నుంచి 20 చానళ్లు చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేజ్రీవాల్కు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.
పుస్తకాలు కోసం కేజ్రీవాల్ వినతి
ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ తరఫు లాయర్లు మెమో దాఖలు చేశారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ పుస్తకాలు జ్యుడిషీయల్ కస్టడీలో చదివేందుకు అనుమతించాలని కోర్టును కోరారు.