మినీ స్టేడియాన్ని కూల్చివేస్తే ఉద్యమమే..

మినీ స్టేడియాన్ని  కూల్చివేస్తే ఉద్యమమే..

నిజామాబాద్,  వెలుగు:  జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం తరలింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  ఆల్టర్నేట్ ​చూపకుండా ఉన్న ఒకే ఒక ​స్టేడియాన్ని కూల్చివేస్తే ఊరుకోబోమని క్రీడా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. క్రీడాకారులకు అండగా విద్యార్థి సంఘాలు, క్రీడా సంఘాల తరఫున  ఒలంపిక్​ సంఘం ఐక్య ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కళాభారతి పేర ఆడిటోరియం నిర్మించాలన్న ప్రపోజల్స్​ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ స్టేడియం కూల్చివేతపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్లేయర్లలో ఆందోళన కలిగిస్తోంది. 

ఇంటిగ్రేటెడ్​ బిల్డింగ్స్​కు శంకుస్థాపన 

నిజామాబాద్​నగరాభివృద్ధి పేరిట ప్రభుత్వం మినీ స్టేడియం, పాత కలెక్టరేట్, తహసీల్దార్, డీఈవో, ఆర్డీవో, ఇరిగేషన్​  డిపార్ట్​మెంట్ పాతభవనాలను కూల్చివేసింది. ఈ స్థలాల్లో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు, కళాభారతి ఆడిటోరియం నిర్మించాలని ప్రపోజల్స్ పెట్టింది. ఇందులో భాగంగా అధికారులు ప్రభుత్వ ఆఫీస్​లను న్యూ కలెక్టరేట్​కు తరలించారు. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు, కళాభారతి ఆడిటోరియం నిర్మాణానికి డిసెంబర్​ నెలలో మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన కూడా చేశారు.  

ప్లేయర్లకు పెద్ద దిక్కు మినీ గ్రౌండ్​

జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్​ అథారిటీ గ్రౌండ్​ను 1975లో నిర్మించారు.  1999లో  మినీ స్టేడియంగా అప్​ గ్రేడ్​ చేశారు. ఈ స్టేడియం లో జిల్లా స్కూల్​ స్పోర్ట్స్​ మీట్స్, ​ రూరల్ స్పోర్ట్స్​, వివిధ క్రీడల్లో కోచింగ్​ఇచ్చేందుకు  గ్రౌండ్​ ఉపయోగపడుతోంది. దాదాపు 50 ఏండ్లుగా ఈ గ్రౌండ్​లో జిల్లాలోని స్టేట్, నేషనల్​ ప్లేయర్లు శిక్షణ పొందుతున్నారు. బాక్సింగ్​, ఖో‌‌-ఖో, కబడ్డీ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల శిక్షణకు  మినీ స్టేడియం వేదిక గా ఉంది.  నగరంలో ప్లేయర్లకు అందుబాటులో ఉన్న మరో గ్రౌండ్​ ఖలీల్​ వాడీలో 2012లో జనరల్​ హాస్పిటల్​ నిర్మాణం జరిగింది. అప్పటి  నుంచి  మినీ స్టేడియం క్రీడాకారులకు ఒకే గ్రౌండ్​  పెద్దదిక్కుగా మారింది.  1990లో రాజారం స్టేడియం నిర్మించారు. కానీ ఈ స్టేడియం  జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో  ప్లేయర్లు వెళ్లలేదు. ఇందులో1998లో స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ఇండియా  ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేసింది. అది కూడా తరలిపోవడంతో  రాజారాం స్టేడియం నిరూపయోగంగా మారింది. 

రాజకీయ లబ్ధి కోసమేనని..

ప్రభుత్వ బిల్డింగ్స్​కూల్చివేత వెనుక రాజకీయ లబ్ధి ఉందని  నగరవాసులు ఆరోపిస్తున్నారు. 8 ఏండ్ల కింద చేపట్టిన బొడ్డెమ్మ చెరువు ట్యాంక్​ బండ్,  అండర్ డ్రైన్​నిర్మాణ పనులు ఇంకా పూర్తి  చేయలేదు. నగరంలో ట్రాఫిక్​ వ్యవస్థ అస్తవ్యస్తంగా  ఉంది.  ఇలా ఏ సమస్యను  పట్టించుకోకుండా  ఉన్న బిల్డింగ్స్, స్టేడియాన్ని​కూలగొట్టడమేమిటని మండిపడుతున్నారు. ఈ స్థలాలను ప్రైవేట్​వ్యక్తులకు లీజులకు ఇచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.  ఈ భూములు ప్రైవేట్​పరం కాకుండా చూడాలని కోరుతున్నారు. 

స్టేడియాన్ని  కూల్చివేస్తే ఉద్యమమే..


మినీ స్టేడియం ప్రాంతాన్ని కలిపి కళాభారతి నిర్మించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. మినీస్టేడియాన్ని కూల్చివేస్తే ఉద్యమిస్తాం. క్రీడల్లో ఇక్కడ శిక్షణ పొందుతున్న  ప్లేయర్లు నేషనల్, ఇంటర్​నేషనల్​స్థాయిలో రాణిస్తున్నరు. ఇందూరులో ఉన్న ఒకే ఒక స్టేడియాన్ని  కళాభారతి  పేరుతో దూరం చేయొద్దు.

- నవీన్, ఏబీవీపీ లీడర్

స్టేడియాన్ని తరలించొద్దు


ప్లేయర్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న మినీ స్టేడియాన్ని తరలిస్తే క్రీడాసంఘాల తరఫున ఉద్యమిస్తాం. ఖలీల్​వాడీలో హాస్పిటల్​ నిర్మించారు. పాలిటెక్నిక్​ గ్రౌండ్ లోకి ఇతరులకు అనుమతి ఉండదు. ఒక వేళ ప్లేయర్లు  రాజారాం స్టేడియానికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్​స్టేడియం లేనప్పుడు కూల్చివేయడం సరికాదు.

- అందెల లింగయ్య,  కబడ్డీ సంఘం ప్రతినిధి