- కొద్దిరోజుల్లోనే విధివిధానాలు ఖరారు...అధికారిక ప్రకటన
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గోదావరిఖని, వెలుగు: రామగుండంలో నిజాం కాలం నాడు ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ను తొలగించి దాని స్థానంలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదించిందని, కొద్దిరోజుల్లోనే విధివిధానాలు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించనున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్తో గోదావరిఖనిలో పర్యటించారు.
ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.80.52 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు, టీయూఎఫ్ఐడీ ద్వారా రూ.88.90 కోట్లతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం, ఆర్అండ్బీ ద్వారా చేపట్టనున్న రూ.6.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామగుండం ప్రాంతంలో నిర్మించిన 633 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు, 494 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. వీరిలో రాష్ట్రంలోనే తొలిసారిగా 31 మంది ట్రాన్స్జెండర్స్ఉన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ప్రతివారం నిధులు విడుదల చేస్తోందన్నారు. సింగరేణి కాలరీస్ను కాపాడేందుకు బొగ్గు ఉత్పత్తితో పాటు రేర్ ఎర్త్ మైనింగ్లో కూడా భాగస్వాములయ్యేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, జెన్ కో, డిస్కంలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా కల్పించిందని, అదే విధంగా రాష్ట్రంలో పనిచేసే 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే నెలలో ఇన్సురెన్స్ చేయించబోతున్నామని ప్రకటించారు.
ఆడబిడ్డకు న్యాయం చేయనోళ్లు.. ప్రజలకు న్యాయం చేస్తరా...? మంత్రి పొంగులేటి
ఇంట్లో చిచ్చును కూడా ఆర్పలేనోళ్లు, ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేనోళ్లు.. ప్రజలకు న్యాయం చేస్తారా ...? అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బీఆర్ఎస్ హైకమాండ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికే మూడుసార్లు బీఆర్ఎస్ను ఓడించారని, రాబోయే మున్సిపల్ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్ట్ల సమస్య పరిష్కారం విషయంలో ప్రజాప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని తెలిపారు.
రామగుండం కార్పొరేషన్ ఏరియాలో జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అదనంగా మరో తహసీల్ ఆఫీస్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో రాబోయే మున్సిపల్ఎన్నికల్లో బల్దియాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మినిమమ్వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, మెంబర్ ఎస్.నర్సింహరెడ్డి, స్టేట్ఫైనాన్స్సెక్రటరీ సందీప్కుమార్సుల్తానియా, హౌసింగ్ పీడీ రాజేశ్వరరావు, రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా, సింగరేణి జీఎం లలిత్కుమార్ పాల్గొన్నారు.
