- బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్
- గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినం
- రైతుబంధుకు 7 వేల కోట్లు జమచేసినట్టు అబద్ధం చెప్పారు
- 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నరు
- అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు
- రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడ ఇచ్చింది?
- తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కడ్తం
- వాడకం పెరిగినా కోతల్లేకుండా కరెంట్ ఇస్తున్నామని వెల్లడి
- మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం
- స్కీమ్లు, శాలరీలు, కిస్తీలకు రూ.66,507 కోట్లు
- 120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖాళీ ఖజానాను తాము సెట్ చేస్తున్నామని, గత ప్రభుత్వ అప్పులకు కిస్తీలు కడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలి పారు. రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు ఉంచిన ట్టు బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధా లని, రాష్ట్ర ఖజానా రూ.3,600 కోట్ల లోటులో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని వెల్లడించారు.
4 నెలల్లో గత ప్రభుత్వ అప్పుల కిస్తీలే రూ.26 వేల కోట్ల పైన చెల్లించినట్టు చెప్పారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లా డారు. తుమ్మడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు కడుతా మని చెప్పారు. బీ టాక్స్, ఆర్ టాక్స్ తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించారు. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కొత్త విద్యుత్ పాలసీని తీసుకురానున్నట్టు వెల్లడించారు.
ఆర్థిక.. ఇతర అవసరాలకు ఫోన్ ట్యాపింగ్
గత సర్కారు హయాంలో ఆర్థిక, ఇతర అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని బెదిరించారని భట్టి తెలిపారు. వారు చేసిన తప్పిదాలు, వారి ఆలోచనలే మిగతావారికి కూడా ఉంటాయని ఊహించుకుని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యా పింగ్ చేస్తున్నదని అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టలేదని చెప్పారు.
రూ.10 లక్షల కోట్లు కాదు.. రూ.3.70 లక్షల కోట్లే!
పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చామని ఓ కేంద్ర మంత్రి చెప్పడం అబద్ధమని, కేవలం రూ.3,70,235 కోట్లు మాత్రమే వచ్చాయని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లించిన పన్నుల నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కూడా రాలేదని, అయినా కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పు రూ.7లక్షల కోట్లు ఏమయ్యాయో వారే చెప్పాలన్నారు.
2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం రూ.3,690 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పజెప్పిందన్నారు. కానీ, ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుకు రూ.7 వేల కోట్లు కేటాయించామని, ఈసీ అనుమతి ఇస్తే రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిందని, మరి ఆ రూ.7 వేల కోట్లు ఏమయ్యాయని భట్టి ప్రశ్నించారు. ఆ డబ్బంతా ఎవరి అకౌంట్లలోకి పోయిందో మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తే..రూపాయి రూపాయి పోగేసి ఒకటో తారీఖున ఉద్యోగులకు, పెన్షన్ దారులకు వేతనాలు చెల్లించే స్ధితికి తీసుకొచ్చినం’ అని భట్టి వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏండ్ల తరబడి పెండింగ్లో పెట్టిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ బిల్లులు, ఆశ, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు, గ్రామ పంచాయతీ స్వీపర్ల వేతనాలు చెల్లించామని తెలిపారు. 65 లక్షల మంది రైతులకు రూ.5,575 కోట్ల రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. మిగతా 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీని గాడిలో పెట్టామని, వచ్చే ఐదేండ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు.
వాళ్లు యూనిట్కు 20 పెడితే..మేం రూ.10కే కొంటున్నం
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలాంటి కృషి చేయలేదని భట్టి విక్రమార్క అన్నారు. యూనిట్కు రూ.20చొప్పున విద్యుత్ను కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజల మీద భారం మోపిందని మండిపడ్డారు. పవర్ ఎక్సేంజ్లో పీక్ అవర్స్ కోసం యూనిట్కు రూ.10 చొప్పున మాత్రమే తమ ప్రభుత్వం పారదర్శకంగా విద్యుత్ను కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. త్వరలోనే కొత్త విద్యుత్తు పాలసీ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్కోతలు లేవని, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. గత నెల 8న 15,623 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా అంతరాయం లేకుండా విద్యుత్ను అందించినట్టు తెలిపారు. విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేటాయించినప్పటికీ.. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు దీన్ని విస్మరించిందన్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎన్టీపీసీ విద్యుత్తు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. తొలి బడ్జెట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బిల్డింగుల నిర్మాణానికి రూ.4 వేల కోట్లు కేటాయించామని, త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.
నీళ్లు వదిలి కరువు సృష్టించారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను వృథాగా వదిలి కృత్రిమ కరువును సృష్టించిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ కుంగిపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారే నీళ్లను దిగువకు వదిలిందని చెప్పా రు. వారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. నీటి ఎద్దడి సమస్యలను అధిగమించడానికి అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తూ.. రూ.100 కోట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లో మంచి నీటి కొరత రానివ్వబోమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేండ్లు ఢోకా లేదని అన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇందులో భాగమేనని వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో పర్యటించి, వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.