
కొమురవెల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆషాడ మాసం ప్రారంభంకావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయాన్నే స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మల్లన్నకు అభిషేకం చేసి పట్నాలు వేసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
కొంత మంది స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. మరికొందరు కొండపైన శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకొని బోనం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో అన్నపూర్ణ, అర్చకుడు మహదేవుని మల్లికార్జున్ అన్ని ఏర్పాట్లు చేశారు.- కొమురవెల్లి, వెలుగు