- స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగాలి
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
- ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ బి.శివధర్రెడ్డి రివ్యూ
కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగాలని డీజీపీ బి.శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీసులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, చెక్ పోస్టులు, భద్రతా చర్యలు, బైండోవర్లు, ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, పోలింగ్ భద్రతపై ఆయా జిల్లాల అధికారులు పవర్ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలు, భయబ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒకరూ నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల అనంతరం అదే రోజు విజయోత్సవ ర్యాలీలు తీయరాదని తెలిపారు.
ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంగా బైండోవర్ చేసిన ఐదుగురు వ్యక్తులు ప్రవర్తన రూల్స్ ఉల్లంఘించగా జరిమానా విధించారన్నారు. కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర, నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్సీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. డీజీపీని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ మర్యాద పూర్వకంగా కలిశారు.
