ఇంతకుముందుతో పోలిస్తే జనాన్ని రకరకాల జబ్బులు తెగ ఇబ్బంది పెడుతున్నయ్. నిల్చుంటేనొప్పి. కూర్చుంటే తీపి అన్నట్టు తయారైందిచాలామంది పరిస్థితి. ఎంత టెక్నాలజీ వస్తే ఏంది ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏంది? ఆరోగ్యం సరిగా ఉంటే కదా వాటన్నింటినీ వాడుకునేది. ఎంజాయ్ చేసేది. అదంతా సరే కానీ, ఇంత హైరానా పడాల్సిన విషయం ఇప్పుడేముంది!? కరోనాని కట్టడి చేసినం కదా అంటున్నారా. దాని సంగతి పక్కన పెడితే... ఆరోగ్యం గురించి కాస్త ఎక్కువ ఆలోచించాలని మొన్నీమధ్య విడుదలైన ఒక సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్, ఐసీఎంఆర్ కలిసి దేశవ్యాప్తంగా ఈ సర్వే చేసినయ్. అందులో ప్రజారోగ్యం గురించిన నిజాలు కొన్ని బయటికొచ్చినయ్.
అవేంటంటే... మన దేశ జనాభాలో 25 కోట్ల మంది జనరల్ ఒబెసిటీతో బాధపడుతున్నారు. 31 కోట్లమందికి హైబీపీ ఉంది. 13 కోట్ల మంది ప్రి–డయాబెటిస్ అంచున ఉన్నారు. మొత్తంమీద దేశ జనాభాలో పది కోట్ల మందికి పైగా షుగర్ జబ్బుతో బాధపడుతున్నారు. కాగా గోవాలో అత్యధికంగా 26.4 శాతం డయాబెటిస్ జబ్బున పడ్డారు. అదే మన రాష్ట్రంలో తీసుకుంటే 7.5 శాతం షుగర్ పేషెంట్లు ఉన్నారు. అదే ఒబెసిటీ విషయానికొస్తే 25 శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ లెక్కలన్నీ చూశాక అయినా ఒళ్లు భద్రంగా పెట్టుకోవాలి కదా!
మరీ ముఖ్యంగా చక్కెర జబ్బు విషయంలో ఇంకింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అది శరీరంలో ఒక్కో పార్ట్ మీద దాడి చేసి మనిషిని ఆగమాగం చేస్తుంది. పిల్లాపెద్దా, ఆడమగా అనే తేడా లేకుండా అందరి మీద దాడిచేసే ఈ జబ్బు దరికి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సినవి కొన్ని ఉన్నయ్. అవేంటంటే... ఏం తింటున్నమో చూసుకోవాలి. శరీరానికి సరైన ఎక్సర్సైజ్ ఇస్తున్నమో లేదో గమనించుకోవాలి. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.... ఆరోగ్య పగ్గాలు మీ చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే చక్కెర జబ్బు ఒంట్లోకి చేరితే కనక ఒంటి మీదికి తెచ్చుకునే నెత్తినొప్పి ఎక్స్పరిమెంట్స్ చేయకుండా.... డాక్టర్ చెప్పిన మందులు మంచిగా వేసుకుంటూ, వాళ్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ... మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోవాలి.