పూణెలోని ప్రముఖ తనిష్క్ షోరూమ్లో తక్కువ ధరకు వజ్రాలను ఎక్కువ ధరకు విక్రయిస్తూ మోసం చేస్తున్న షాకింగ్ కేసు బయటపడింది. లోనీ కల్భోర్కు చెందిన 46 ఏళ్ల మహిళ విష్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె రూ.3.48 కోట్లు మోసపోయినట్లు ఆరోపించింది. ఫిర్యాదు అందకున్న పూణే పోలీసులు చీఫ్ సేల్స్మెన్తో సహా పలువురు ఉద్యోగులను అరెస్టు చేశారు. షోరూమ్ మేనేజర్, క్యాషియర్, బిజినెస్ మేనేజర్, యజమానితో సహా పలువురిపై అభియోగాలు మోపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపారం చేస్తున్న ఓ మహిళ డిసెంబర్ 2018 నుంచి లక్ష్మీ రోడ్లోని తనిష్క్ షోరూమ్కు కస్టమర్గా ఉన్నారు.
అయిదేళ్లుగా ఆమె షోరూమ్ నుండి రూ.4.19 కోట్ల విలువైన వజ్రాభరణాలను కొనుగోలు చేసింది. ఇటీవల ఆమె ఆభరణాలు మార్చుకునేందుకు ప్రయత్నించగా అందులో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. సిబ్బందితో సమస్య పరిష్కరించుకోవాలని చూసినా షోరూం నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తరువాత వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వేరే షోరూం కి వెళ్లి కంపేర్ చేసి చూడగా అప్పటి వరకు తాను కొన్న వజ్రాలు నాణ్యత లేనివి అని తెలియడంతో షాక్ కు గురైంది. మోసగాళ్లు తనిష్క్ సింబల్స్తో నకిలీ బిల్లులను రూపొందించారు. ఫలితంగా ₹3.48 కోట్ల నష్టం వాటిల్లిన్నట్లు ఆమె గుర్తించారు. దీంతో పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు స్పీడప్ చేసిన పోలీసులు సంగీత మహాజన్, తేజల్ పవార్, అమోల్ మోహితే, సాగర్ ధోండే, చందన్ గుప్తా, ధవల్ మెహతా, షోరూమ్ యజమాని హితేష్ పునామియాతో, చీఫ్ సేల్స్మెన్ చేతన్ విస్పుటేను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.