ముంబైలోని భారత్ డైమండ్ బోర్స్ స్టోర్లో ఘటన
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని ఓ నగల కంపెనీ దుకాణంలో ఆరు నెలల కాలంలో రూ.5.62 కోట్ల విలువైన వజ్రాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కంపెనీ ఉద్యోగులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని బుధవారం పోలీసులు తెలిపారు. సంజయ్ షా డైరెక్టర్గా ఉన్న జేబీ అండ్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన భారత్ డైమండ్ బోర్స్ స్టోర్ బాంద్రాకుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉంది.
ఇందులో రూ.5.62 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయని సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాందీవలిలో నివాసం ఉంటున్న తమ కంపెనీ ఉద్యోగులు ప్రశాంత్ షా, విశాల్ షా గత ఏప్రిల్లో తమ స్టోర్ నుంచి వజ్రాలను ఎత్తుకెళ్లినట్లు అనుమానంగా ఉందని కంప్లయింట్లో పేర్కొన్నారు. దొంగిలించిన వజ్రాలను విక్రయించడంలో కంపెనీ మాజీ ఉద్యోగి నీలేశ్ షా వీరికి సహకరించినట్లు తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.