- ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్కార్డు మస్ట్ అనే రూల్ను సడలించండి
- మెడికల్ కాలేజీలున్నచోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలుండాలి
- అందుకు అవసరమయ్యే కామన్ పాలసీని తీసుకురావాలి
- బీబీనగర్ ఎయిమ్స్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి
- ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి
- గవర్నమెంట్ దవాఖాన్లకు ప్రతినెలా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించండి
- ప్రైవేటు ఆస్పత్రులకు 3 నెలలకోసారి చెల్లించేలా ఒప్పందం చేసుకోండి
- వైద్య, ఆరోగ్య శాఖ రివ్యూలో అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్తో అనుసంధానం చేయాలని, దాని వల్ల అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని చెప్పారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం సెక్రటేరియెట్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఆరోగ్య శ్రీకి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్లరేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్నదని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియో థెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు.
డాక్టర్ల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభంకాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు అంశంపై పరిశీలన చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఎయిమ్స్ పూర్తిస్థాయిలో..
బీబీ నగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ‘‘ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. ఎయిమ్స్ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయండి. ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే నేనే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్త. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడండి. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోండి’’ అని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలోని సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించిన అంశం కోర్టులో ఉన్నందున, కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని అధికారులకు సీఎం సూచించారు.
హాస్పిటల్స్కు ఫార్మా కంపెనీలు హౌస్ కీపింగ్ సేవలివ్వాలి
మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సంస్థలు తమ సీఎస్ఆర్ నిధులను ఉపయోగించి హౌస్ కీపింగ్ సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.. జూనియర్ డాక్టర్స్, ఆశా వర్కర్స్, స్టాఫ్ నర్సులకు జీతాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించేలా చూడాలని చెప్పారు. 108, 102 సేవల పనితీరుపై సీఎం ఆరా తీశారు. వాటి సేవలను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, కమిషనర్ కర్ణన్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విచాలాచ్చి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను విధిగా విడుదల చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్కు, ప్రభుత్వ హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.