హైదరాబాద్, వెలుగు: పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రెండు వారాల్లో డాక్టర్ల నియామకం పూర్తవుతుందన్నారు. ఈ మేరకు పీహెచ్సీల్లో డాక్టర్ల కొరతపై ‘పేరుకే పీహెచ్సీలు’ శీర్షికతో వెలుగులో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. పీహెచ్సీల్లో 751 మంది డాక్టర్ల నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. 1,529 పల్లె దవాఖాన్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ల నియామకం కూడా ఈ వారంలో పూర్తవుతుందని తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, 3నెలలకు సరిపడా స్టాక్ నిల్వ ఉందని వివరించారు. అక్టోబర్ లో అన్ని పీహెచ్సీల్లో కలిపి 2,910 డెలివరీలు జరిగాయన్నారు. నవంబర్లో మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. టెస్టులు అవసరమైన వారి వద్ద శాంపిల్స్ తీసుకుని టీ డయాగ్నోస్టిక్ హబ్స్కు పంపిస్తున్నామన్నారు. పీహెచ్సీల బలోపేతానికి అన్నిరకాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, 43 పీహెచ్సీలకు కొత్త బిల్డింగులను ఇటీవలే మంజూరు చేసిందని వెల్లడించారు.