జ్వరాలపై జిల్లాకో కాల్ సెంటర్.. అధికారులకు డీహెచ్ ఆదేశం

జ్వరాలపై జిల్లాకో  కాల్ సెంటర్..  అధికారులకు డీహెచ్ ఆదేశం

రాష్ట్రంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నందున ప్రతి జిల్లాకో  కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం  అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో  డీహెచ్‌‌ శ్రీనివాసరావు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 24 గంటల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, నంబర్లు ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 బాధితులకు వైద్య పరంగా ఎలాంటి సహాయమైన అందించాలని స్పష్టం చేశారు. ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్న దవాఖాన్లలో సెపరేట్ ఓపీ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో  డెంగీతో  నలుగురే చనిపోయారని తెలిపారు. జ్వరాల గురించి ప్రజలు అనవసర ఆందోళన చెందొద్దని గురువారం ఒక ప్రకటనలో కోరారు.  ములుగు జిల్లాలో ఇటీవల డెంగీతో పది మంది చనిపోయారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.