Diwali Special: ఉత్తరాదిన ఒకలా.. దక్షణాదిన మరోలా దీపావళి వేడుకలు.. కారణం ఇదే

Diwali Special:  ఉత్తరాదిన ఒకలా.. దక్షణాదిన మరోలా దీపావళి వేడుకలు.. కారణం ఇదే

దేశ వ్యాప్తంగా దీపావళి  పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.   భారతదేశం అంతటా తమ తమ ప్రాంతాల్లోని సాంప్రదాయాలను అనుసరిస్తూ తమదైన రీతిలో జరుపుకుంటారు.  దక్షిణ భారతదేశంలో జరుపుకునే దీపావళికి ...ఉత్తర భారతదేశంలో జరుపుకునే దీపావళికి కొన్ని తేడాలున్నాయి.  ఇప్పుడు  ఆ తేడాలను తెలుసుకుందాం. . . 

 దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. హిందువుల పండుగలలో  దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి గెలిచిన దానికి ప్రతికగా ఈ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి పండుగ పేరు వినగానే టక్కున గుర్తోచ్చేవి టపాసులు, స్వీట్స్‌, దీపాలు, కొత్త బట్టలు. కానీ అవే కాకుండా వ్రతాలు, పూజలు అని ఇంకా చాలా ఉన్నాయ్‌. దీపావళి అంటే చిన్న, పెద్ద, పేద, ధనిక,  అనే వర్గం లేకుండా భారత ప్రజలంతా ఉత్సహంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో నాలుగు నుంచి ఐదు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా  దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో దీపావళిని జరుపుకోవడంలో కొన్ని తేడాలున్నాయి.

ఉత్తర భారతదేశంలో దీపావళిని ఎలా జరుపుకుంటారంటే..

దీపావళి పండుగను మొదటినుంచీ ఉత్తర భారతంలోనే చాలా ప్రత్యేకంగా జరపుకుంటారు. లక్ష్మీదేవీకి నిష్టగా పూజలు,  వ్రతాలు చేసుకుని ఆ తర్వాత వారి బంధుమిత్రులను పూజలకు, వ్రతాలకు ఆహ్వానించడం, ఆ తర్వాత అంతా కలిసి ఒక చోట చేరి సాయంకాలం టసాసులు పేల్చి ఆనందోత్సహాలతో దీపావళి వేడుకను జరుపుకుంటారు. అలాగే మన దక్షిణ భారతంలో కూడా మొదటినుంచి పూజలు, వ్రతాల సంస్కృతి ఉన్నప్పటికీ బంధుమిత్ర సమేతంగా ఉత్తర భారతీయులు జరుపుకునేంత ప్రత్యేకంగా జరుపుకునే వారు కాదు. బంధుమిత్రులతో కలిసి కాకుండా వారి కుటుంబాలతో మాత్రమే జరుపుకునే వారు. 

14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు.. అయోధ్యలో దీపాలు, రంగు రంగు ముగ్గులతో అలంకరించి ప్రజలు శ్రీరాముడికి స్వాగతం చెప్పాలని ఉత్తరాదివాసుల నమ్మకం. అందుకనే ఈ ప్రాంత ప్రజలందరూ రంగు రంగుల రంగవల్లుళ్లను వేస్తారు.. దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజున గణపతిని, లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏడాది పొడవునా సుఖసంతోషాలతో ఉంటయని నమ్మకం. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలోని  ప్రజలు ఇళ్లను లైట్లు, దీపాలు, ఇతర వస్తువులతో అలంకరిస్తారు. అంతే కాకుండా రంగోలికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు.

ఉత్తర భారతదేశంలో దీపావళికి రెండు రోజుల ముందు ధన్ తేరాస్ ను జరుపుకుంటారు. ఈ రోజున బంగారు ఆభరణాలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు ఈ రోజున కుబేరుడిని పూజించే సాంప్రదాయం కూడా ఉత్తర భారతదేశంలో ఉంది. దీనితో పాటు, దీపావళిని హిందూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా వ్యాపారవేత్తలు భావిస్తారు.

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, దీపావళి పండుగలు లేదా రకరకాల ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు.ఉత్తర భారతంలో ఈ పండగను ఐదు రోజులు జరుపుకుంటే దక్షిణంలో నాలుగు రోజులు జరుపుకుంటారు. పేరు కూడా ఉత్తరంలో దీవాళి అంటే దక్షిణంలో దీపావళి అని అంటారు. రెండూ ఒకటే పండుగను సూచిస్తాయి. ఉత్తరంలో ధన్‌తెరాస్‌ పండుగకు బంగారం కొనడం సెంటిమెంట్‌. ధన్‌ అంటే ధనము. తేరాస్‌ అంటే పదమూడో రోజు అని అర్థం. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే క్రమంలో పదమూడో రోజు దీపావళి పండుగ ప్రారంభమవుతుందని దాని అర్ధం.  మార్వాడి వంటి కొన్ని తెగల ప్రజలు  దీపావళికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.  ఉత్తర భారతదేశంలో వీరి లాంటి జాతులు, తెగల వారికి దీపావళి రోజునే కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది . దక్షిణ భారతదేశం, పశ్చిమ బెంగాల్‌ వంటి ప్రాంతాల్లో దసరాకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉత్తరాది వారికి దీపావళి అలాంటిది. ఆహారం విషయానికొస్తే సాధారణంగా ఏ పండుగకైనా ఇంట్లో మాంసాహారంతో విందు చేసుకుంటారు. కానీ, దీపావళి పండుగకు మాత్రం ఉత్తర భారతంలో పూర్తి శాఖాహారానికే పరిమితమవుతారు. 

దక్షిణ భారతదేశంలో దీపావళిని ఎలా జరుపుకుంటారంటే:

దక్షిణంలో ఆ సంస్కృతి మొదట్లో లేదు. కానీ ఇప్పుడిప్పుడే సౌత్‌లో కూడా బంగారం కొంటున్నారు. దీనికి ఉత్తరాది ప్రజలు దక్షిణాదికి వలస రావడం కారణం కావచ్చు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆత్మీయులను, బంధువులను పిలిపించి ఆతిథ్యమివ్వడం, స్వీట్లు, తినుబండారాలు, పిండివంటలు, ఇంట్లో దీపాలు వెలిగించడం వరకు అంత ఒకేలా ఉంటాయి. దాంతో పాటు టపాసులు, చిచ్చుబుడ్లు పేల్చడం నేడు దేశమంతా సాధారణమైపోయింది.  దక్షిణాదిన దీపావళి పండుగకు చేసుకునే నోములు, వ్రతాలు వంటి వాటికి వారి కుటుంబీకులు తప్ప వేరే వారు ఉండకూడదన్న నమ్మకంతో ఉంటారు. కానీ ఇప్పుడు  కాలానుగుణంగా ఉత్తర భారతీయులను చూసి వారి సంస్కృతిని మన దక్షిణాది ప్రజలు కూడ అవలంబిస్తున్నారు. దక్షిణాదిలో ఈ మాసం ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది.దక్షిణాదిలో  శాఖాహారానికే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే దీపావళి పండుగ రోజు ప్రతీ ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు. దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. 

దీపావళి సందర్భంగా ప్రజలు కూడా ఇక్కడ స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. తమకు ప్రియమైన వారిని కలవడానికి వెళతారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పే ఆచారం దక్షిణ భారతదేశంలో ఉంది. నరక చతుర్దశి రోజున చాలా మంది ప్రజలు నూనెతో తలస్నానం చేసి, ఆ తర్వాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. లేదంటే ఇంట్లో పూజలో పాల్గొంటారు.మర్నాడు అంటే దీపావళి అమావాస్య రోజున సాయంత్రం కొత్తబట్టలు ధరించి దీపాలను వెలిగిస్తారు. కొంతమంది గోంగూర కర్రలను ఉపయోగించి దివిటీలు కొట్టే సంప్రాదయని పాటిస్తారు. 

శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సమేతంగా నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన లోకాన్ని రక్షించడానికి.. అప్పటి నుంచి  దీపావళిని జరుపుకోవడం ఆచారంగా మారిందని దక్షిణ భారతదేశంలోని ఓ నమ్మకం. అందుకనే దక్షిణాదిలో చాలా ప్రాంతాలలో దీపావళి జరుపుకుంటారని చెబుతారు. దీపావళికి ఒక రోజు ముందు రోజుని  దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి అంటారు.  నరకాసుర వధని నరక చతుర్దశిగా జరుపుకుంటూ.. ఆరోజు ఉదయమే అభ్యంగ స్నానం చేస్తారు. సాయంత్రం యమ దీపాలు పెడతారు.