- లేకపోతే తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: అప్పులను వసూలు చేసేటప్పుడు రికవరీ ఏజెంట్లు అప్పు తీసుకున్న వారిని బెదిరించినా లేదా ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టినా ఊరుకోమని రిజర్వ్ బ్యాంక్ మరోసారి ప్రకటించింది. ఇందుకు గాను రూల్స్ను కఠినతరం చేస్తూ శుక్రవారం నోటిఫికే షన్ను విడుదల చేసింది. లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు వస్తుండడంతో రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ నియంత్రణలోని ప్రతీ సంస్థ తమ రికవరీ ఏజెంట్లను కంట్రోల్లో పెట్టుకోవాలని హెచ్చరించింది. బారోవర్ల నుంచి అప్పులు వసూలు చేసేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టేలా చర్యలు ఉండకూడదని తెలిపింది. ‘లోన్ రికవరీ ఏజెంట్ల చర్యల వలన అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.నియంత్రణలోని సంస్థలు స్వయంగా లేదా ఏజెంట్ల ద్వారా లోన్లను రికవరీ చేసేటప్పుడు బారోవర్లను బెదిరించకూడదు. మాటల ద్వారా లేదా ఫిజికల్గానైనా ఇబ్బందిపెట్టకూడదని సలహాయిస్తున్నాం’ అని రిజర్వ్ బ్యాంక్ తమ వెబ్సైట్లోని ఓ నోటిఫికేషన్లో పేర్కొంది.
తాము నియమించుకున్న రికవరీ ఏజెంట్లు బారోవర్ల ఫ్రెండ్స్ను, ఫ్యామిలీ మెంబర్లను పబ్లిక్గా అవమానించకుండా బ్యాంకులు, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) చూసుకోవాలని వివరించింది. అంతేకాకుండా రికవరీ ఏజెంట్లు బారోవర్ల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రయత్నించకూడదని, మొబైల్కి లేదా సోషల్ మీడియా ద్వారా వారికి మెసెజ్లు పెట్టడాన్ని ఆపాలని తెలిపింది. బెదిరించడం లేదా ఎప్పటికప్పుడు కాల్స్ చేయడం మానాలని పేర్కొంది. లోన్ రికవరీ కోసం ఏజెంట్లు బారోవర్లకు ఉదయం 8 గంటలకి ముందు, సాయంత్రం 7 తర్వాత కాల్స్ చేయకూడదని ఆదేశించింది.
పైన పేర్కొన్నఏ నియమాన్నైనా తప్పితే తమ నియంత్రణలోని సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. తాజాగా డిజిటల్ లెండింగ్పై కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ను ప్రకటించిన విషయం తెలిసిందే. బారోవర్ల వివరాలను తప్పుగా వాడుతున్న యాప్లు, వెబ్సైట్లకు చెక్ పెట్టేందుకు బుధవారం మొదటి దశ ఫ్రేమ్ వర్క్ను విడుదల చేసింది.ఇందులో భాగంగా డిజిటల్ లోన్కు సంబంధించి అన్ని రకాల ఖర్చులను సంస్థలు ముందే బయటపెట్టాల్సి ఉంటుంది. బారోవర్ల అనుమతి పొందాకనే డేటా సేకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లోన్లను డిస్బర్స్ చేయడం, రీపేమెంట్..రెండూ ఆర్బీఐ నియంత్రణలోని సంస్థకు, బారోవర్కు మధ్య మాత్రమే జరగాలని ఆదేశించింది.