- ఇది మంచి పద్ధతి కాదు
- సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు
- ఈ నెల 22న విచారిస్తామన్న న్యాయస్థానం
న్యూ ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం సరికాదన్నారు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 20వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. 22వ తేదీన సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది.
ఈ సందర్భంగా కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం సరికాదని జడ్జి పేర్కొన్నారు. దీనిపై కవిత వరఫు న్యాయవాది మోహిత్ రావు స్పందిస్తూ.. మీడియా అడిగితేనే సమాధానం ఇచ్చారని తెలిపారు. దీనిపై స్పందించిన జడ్జి ఆమె ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి కానీ మీడియాకు కాదన్నారు. ఈ విషయాన్ని కవితకు సూచించాలని జడ్జి ఆదేశించారు. ఒక వేళ మీడియాతో మాట్లాడాలి అనుకుంటే.. కోర్టు బయట మాట్లాడాలి తప్ప.. కారిడార్ లో కాదని తెలిపారు.