పెంపుడు శునకాలు చనిపోతే వాటికి సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారిని చూస్తుంటాం. అలాగే దశదిశ కర్మలు నిర్వహించే వారిని చూస్తుంటాం. కానీ ఖమ్మం కు చెందిన ఓ కుటుంబం మాత్రం తాను పెంచుకున్న శునకం తాలూకూ స్మృతులు మరిచిపోలేక పోతోంది.
కుటుంబం లో ఓ బిడ్డలా చూసుకున్న శునకానికి వర్ధంతి నిర్వహించి దానికి ప్రత్యేక పూజలు సైతం చేశారు ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి తొట కిషన్ రావు కుటుంబ సభ్యులు.
2015 అక్టోబరు 2న పుట్టిన 'పుగ్ బ్రీడ్ కు చెందిన శునకాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుని దానికి రెక్స్ అని నామకరణం చేసి కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్నారు. ప్రతీ ఏడాది అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా చేసేవారు. అయితే అనారోగ్యంతో ఆ శునకం 2021 జూలై 20న మరణించింది. దీంతో ఆరోజున మనుషులకు నిర్వహించే మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం ఆ తర్వాతి కార్యక్రమాలను కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
రెక్స్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. తమ పెంపుడు కుక్క తాలూకూ స్మృతులు ఆ కుటుంబ సభ్యులు మరిచిపోలేదు. రెక్స్ చనిపోయిన తర్వాత మొదటి వర్థంతి, గురువారం రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రెక్సి ఖననం చేసిన చోట, ఇంట్లో రెక్స్ చిత్రపటం వద్ద పూజలు చేసి నివాళి అర్పించారు.