భారత్, పాక్ యుద్ధాన్ని నేను ఆపలే.. మాట మార్చిన ట్రంప్

భారత్, పాక్ యుద్ధాన్ని నేను ఆపలే.. మాట మార్చిన ట్రంప్
  •  
  • ఆ రెండు దేశాలే మాట్లాడుకొని పంచాదీ తెంపుకున్నయని వెల్లడి
  • తానే ఆపినట్లు గతంలో వరుసగా కామెంట్లు, ట్వీట్లు 
  • పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​ అసీమ్​ మునీర్​కు ట్రంప్​ విందు
  • వైట్​హౌస్​లో ఇద్దరి మధ్య ఇరాన్, ఇజ్రాయెల్​ ఉద్రిక్తతలపై చర్చ

వాషింగ్టన్​: భారత్​, పాకిస్తాన్​  మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు వరుసగా కామెంట్లు, ట్వీట్లు చేస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. తాజాగా మాట మార్చేశారు. ఆ రెండు దేశాల వాళ్లే మాట్లాడుకొని ఉద్రిక్తతలు తగ్గించుకున్నారని ఆయన ప్రకటించారు. ‘‘భారత్​, పాకిస్తాన్​ నాయకులు చాలా తెలివైనవాళ్లు. గత నెలలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని భావించి వాళ్లే సమస్యను పరిష్కరించుకున్నారు. ఇందులో మా ప్రమేయం లేదు” అని చెప్పారు. పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​ అసీమ్​ మునీర్​కు  వైట్​హౌస్​లో ట్రంప్​  బుధవారం విందు ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం టెర్రర్​ అటాక్​ తర్వాత.. పాకిస్తాన్​పై భారత సైన్యం ‘ఆపరేషన్​ సిందూర్​’ చేపట్టింది. అనంతరం కొన్నిరోజులకు ఇరుదేశాలు సీజ్​ఫైర్​కు అంగీకరించాయి. అయితే.. తానే ఇరుదేశాల మధ్య సీజ్​ఫైర్​ ఒప్పందాన్ని కుదిర్చినట్లు, లేకపోతే పెద్ద ముప్పు  వాటిల్లేదంటూ ట్రంప్​ పదే పదే చెప్పారు.  ఈ క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ.. ట్రంప్​కు ఫోన్​ చేసి ‘‘ఇండియా, పాకిస్తాన్​ అంశాల్లో ఎవరి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోం. సీజ్​ఫైర్​ విషయంలో మీ ప్రమేయం లేదు” అని తేల్చిచెప్పారు. ఆ వెంటనే ట్రంప్​.. మళ్లీ పాత పాటనే అందుకున్నారు. తానే యుద్ధాన్ని ఆపానంటూ.. పైగా ‘ఐ లవ్​యూ పాకిస్తాన్​’ అని కామెంట్​ చేశారు.  మళ్లీ 24 గంటలు గడవకముందే.. ట్రంప్​ మాట మార్చారు. 

మునీర్​ను కలవడం గౌరవంగా ఉంది

పాక్ ఆర్మీ చీఫ్​ అసీమ్​ మునీర్​తో విందు భోజనం గౌరవంగా ఉందని ట్రంప్​ అన్నారు. ఇరాన్​, ఇజ్రాయెల్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై మునీర్​తో చర్చించానని చెప్పారు. ఇరాన్​లోని టెహ్రాన్​పై అమెరికా ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్న కథనాల నేపథ్యంలో ట్రంప్​, మునీర్​ భేటీ చర్చనీయాంశమైంది. ‘‘భారత్​, పాకిస్తాన్​ రెండు దేశాలతో మాకు మంచి ట్రేడ్​ డీల్​ ఉంది. సత్సంబంధాలు ఉన్నాయి” అని ట్రంప్​ పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్​కు రావాలని ట్రంప్​కు మునీర్​ ఆహ్వానం పలికారు. మునీర్​ వెంట పాక్​ జాతీయ భద్రతా సలహాదారు మాలిక్​, ఐఎస్​ఐ చీఫ్​ కూడా ఉన్నారు. అధ్యక్షుడి స్థాయి నేతలకు మాత్రమే అమెరికా అధ్యక్షుడితో వైట్​ హౌస్​లో విందు భోజనం ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఓ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్​కు ఇలాంటి మర్యాద లభించడం చాలా అరుదు. పాకిస్తాన్​ను అడ్డాగా చేసుకొని ఇరాన్​పై అమెరికా దాడి చేయాలనుకుంటున్నదని, అందులో భాగంగానే పాకిస్తాన్​ ఆర్మీ చీఫ్​కు వైట్​హౌస్​లో ఈ రాచమర్యాదలన్న కథనాలు వస్తున్నాయి.