షెంజెన్ (చైనా): ఇండియా బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్’ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి ఈ సీజన్లో తమ రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. తమ ఎటాకింగ్ గేమ్తో ఆకట్టుకున్న ఈ యంగ్స్టర్స్ చైనా మాస్టర్స్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్లో ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ 21–15, 22–20తో చైనాకు చెందిన హెజి టింగ్–రెజ్ జియాంగ్ యును వరుస గేమ్స్లో ఓడించాడు.
50 నిమిషాల పోరులో ఇండియా ఆటగాళ్ల దూకుడు ముందు ప్రత్యర్థులు తేలిపోయారు. వాళ్ల పవర్ ఫుల్ షాట్లను తట్టుకోలేకపోయారు. ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టిన సాత్విక్–చిరాగ్ తొలి గేమ్లో 6–4, 10–4తో ముందంజ వేశారు. బ్రేక్ తర్వాత చైనా ప్లేయర్లు ఐదు పాయింట్లతో 10–12తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ టైమ్లో అద్భుతమైన సమన్వయంతో ఆడిన ఇండియన్స్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి అదే జోరుతో తొలి గేమ్ను ఈజీగా గెలిచారు.
రెండో గేమ్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓ దశలో చైనా జంట 12–9తో ముందంజ వేసింది. కానీ గొప్పగా పుంజుకున్న ఇండియా జోడీ వెంటనే 13–13తో స్కోరు సమం చేసింది. చివర్లో సాత్విక్ కొట్టిన రెండు షాట్లు నెట్కు తగలడంతో 19–19తో మళ్లీ స్కోరు సమం అయింది. ఈ టైమ్లో చిరాగ్, సాత్విక్ చెరో స్మాష్తో గేమ్తో పాటు మ్యాచ్ నెగ్గారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఈ ఇద్దరూ రెండో సీడ్ లియంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనున్నారు.