
- కామారెడ్డి జిల్లాలో తాగునీటి ఎద్దడి
- కొన్ని ప్రాంతాల్లో వారానికి రెండు, మూడు రోజులే సరఫరా
- ఇండ్లలోని బోర్లలో తగ్గుతున్న నీటి ధారలు
- వ్యవసాయ బోర్ల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్న తండాలవాసులు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎండాకాలంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో లక్ష జనాభా ఉంటుంది. నిత్యం 10 ఎంఎల్డీ నీటి సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 2.8 ఎంఎల్డీ నీళ్లు మాత్రమే సప్లయ్ అవుతున్నాయి. పెద్ద చెరువు, బుర్రమత్తడి నుంచి టౌన్కు నీటి సరఫరా అవుతుంది. ఆయా కాలనీల్లో వారంలో రెండు, మూడు రోజులే నల్లాలు వస్తున్నాయి. పైపులైన్ల లీకేజీలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు మరింత సమస్య ఏర్పడుతుంది. ఎన్జీవోస్కాలనీ, కాకతీయనగర్, అశోక్నగర్, విద్యానగర్, శ్రీరాంనగర్కాలనీ, వివేకానంద కాలనీ తదితర ఏరియాల్లో బోర్లలో నీటి ధారలు తగ్గాయి.
ఇంకా పూర్తి కాని పైపులైన్ మరమ్మతు పనులు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి ఏరియాకు తాగునీరు సప్లయ్ చేసే మెయిన్ పాత పైపులైన్ స్థానంలో కొత్త పైపులైన్ ఏర్పాటు పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు నుంచి సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ వరకు కొత్త పైపులైన్ వేస్తున్నారు. పాత పైపులైన్ తరచుగా లీకేజీ అవుతుండడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు నీటి సప్లయ్లో అంతరాయం ఏర్పడుతున్నది. కామారెడ్డి పట్టణంలో రూ.90 కోట్లతో చేపట్టాల్సిన అమృత్జల్ స్కీమ్ కింద పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటీవల గ్రామాల్లో నీటి సమస్యపై అధికారులు వివరాలు సేకరించారు. అందుబాటులో ఉన్న బోర్లను రిపేర్ చేయించారు.
తండాల్లో సమస్య ..
మాచారెడ్డి మండలంలోని పలు తండాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లయ్ కావడం లేదు. తండాల వాసులు వ్యవసాయ బోర్ల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. సోమర్పేట, బంజేపల్లి, అంకిరెడ్డిపల్లి, కొత్తగూడెం తండా తదితర ఏరియాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సప్లయ్లో అంతరాయం వస్తుందని స్థానికులు తెలిపారు. జిల్లాలోని ఏ పంచాయతీలో కూడా నీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ ద్వారా సప్లయ్ చేస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.