
- డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు
- ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్ కు వెళ్లి హల్ చల్
- లైటర్ తో అంటించుకోగా మంటలార్పిన పోలీసు సిబ్బంది
- నల్గొండ పోలీసుస్టేషన్ లో ఘటన
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేసి ఆత్మహత్యకు యత్నించగా, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. సీఐ రాజశేఖర్రెడ్డి మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నల్గొండ వన్ టౌన్ ఎస్ఐ సైదులు డ్యూటీలో భాగంగా దేవరకొండ రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ, బైక్పై వెళ్లే రావిళ్ల నర్సింహను ఆపి టెస్ట్ చేశారు. అతనికి 155 ఎంజీ/100 ఎంఎల్ ఆల్కహాల్ రీడింగ్ వచ్చింది.
మద్యం తాగి బైక్ నడపవద్దని ఎస్ఐ కౌన్సెలింగ్ చేసి, కేసు నమోదు చేసి, రేపు ఉదయం స్టేషన్కు రావాలని పంపించాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన నర్సింహ 40 నిమిషాల తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ‘నా పైనే కేసు పెడతారా..? అంటూ స్టేషన్ ప్రధాన గేట్లోంచి వెళ్లేందుకు యత్నించాడు. కాగా.. అప్పటికే అతడు బయట ఒంటిపైన పెట్రోల్ పోసుకోగా.. వాసన రావడంతో హోంగార్డు ప్రవీణ్ అడ్డుకున్నాడు.
దీంతో నర్సింహ లైటర్ వెలిగించి ఒంటికి అంటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కానిస్టేబుల్ అంజద్ బెడ్షీట్తో మంటలను ఆర్పేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాలిన గాయాలైన నర్సింహను చికిత్స కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ప్రవీణ్ చేతులకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి. పోలీస్ విధుల కు ఆటంకం కలిగించడం, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సింహపై కేసులు నమోదు చేశారు.