
- ప్రమాదంతో చెలరేగిన మంటలు
- వికారాబాద్ జిల్లాలో ఘటన
పరిగి, వెలుగు: మద్యం మత్తులో లారీని నడిపిన ఓ డ్రైవర్ బైక్ను ఢీకొట్టి కొంత దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. బైక్ నుంచి మంటలు చెలరేగడంతో లారీ నుంచి దిగి పరార్ అయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ సమీపంలో జరిగింది. దోమ మండలం బాస్ పల్లికి చెందిన నర్సింలు, మైలారం గ్రామానికి చెందిన రాఘవేందర్ శుక్రవారం బైక్పై బాస్ పల్లి నుంచి పరిగి వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఆ బైక్ను ఢీకొట్టింది.
డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో లారీని ఆపకుండా ప్రమాదానికి గురైన బైక్ను 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీంతో బైక్ లోని పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేశారు. నర్సింలు, రాఘవేందర్ కు తీవ్ర గాయాలు కాగా 108లో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి వికారాబాద్కు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.