అత్యాధునిక హంగులతో ఢిల్లీలో 36 డూప్లెక్స్ ఫ్లాట్లు
కొత్త ఎంపీల ‘హోటల్ ఖర్చులు’ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని నార్త్ అవెన్యూ ప్రాంతంలో అత్యాధునిక బంగళాలను నిర్మించింది. సకల సౌకర్యాలతో 36 ఫ్లాట్లను కట్టించింది. కొత్త ఎంపీలకు వాటిని కేటాయించనుంది. ఇప్పటిదాకా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైవ్స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారు. ఆ ఖర్చును తగ్గించే పనిలో భాగంగానే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ఈ 36 డూప్లెక్స్ బంగళాలను కట్టించినట్టు చెబుతున్నారు. పర్యావరణ హితంగా ఉండే భవనాలు భూకంపాలనూ తట్టుకుని నిలబడతాయి. ప్రతి అపార్ట్మెంట్ బ్లాక్లో రెండు ఫ్లోర్లుంటాయి. ఉన్నది రెండు ఫ్లోర్లే అయినా లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు.
రాష్ట్రపతి భవన్ కనిపించేలా అందమైన వ్యూతో డిజైన్ చేశారు. ఒక్కొక్క ఫ్లాట్లో నాలుగు బెడ్రూంలుంటాయి. వంటింటినీ అందంగా తీర్చిదిద్దారు. ఫ్లోర్ను గ్రానైట్ మార్బుల్స్తో వేశారు. సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించారు. పనోళ్ల కోసం ఓ చిన్నపాటి రూంనూ కట్టించారు. బేస్మెంట్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. దేవుళ్లకు పూజ చేసుకునేలా చిన్నపాటి ‘టెంపుల్’నూ ఏర్పాటు ఏశారు. కరెంట్ బిల్లును తగ్గించే పనిలో భాగంగా పైకప్పుపై సోలార్ పానెళ్లను ఏర్పాటు చేశారు. కరెంట్ దుబారా కాకుండా వాటంతట అవే ఆన్ అయ్యి ఆఫ్ అయ్యే సెన్సర్ లైట్లను పెట్టారు. అంటే మనుషులు ఎంటరైనప్పుడు ఆన్ అవుతాయి. లేనప్పుడు బంద్ అవుతాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో భేటీ అయిన లోక్సభ సెక్రటేరియట్ ఈ మేరకు ఆయా ఫ్లాట్లను ఎంపీలకు కేటాయించాలని నిర్ణయించారు.
ఫైవ్స్టార్ హోటళ్లలో ఎంపీలు పెడుతున్న లక్షల రూపాయల ఖర్చును తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చారు. కొత్త ఎంపీలకు ఇళ్లు కేటాయించేదాకా వారి వారి రాష్ట్రాల గెస్ట్ హౌస్లు లేదా కొత్తగా రిపేర్లు చేయించిన ప్రభుత్వ అధీనంలోని వెస్టర్న్ కోర్టుల్లో వసతి కల్పించాలని నిర్ణయించారు. 2014లో దాదాపు 300 మంది ఎంపీలు 15 రోజుల నుంచి 3 నెలల పాటు హోటళ్లలో ఉండడం వల్ల కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని లోక్సభ సెక్రటేరియట్ అధికారి ఒకరు చెప్పారు.