అతివృష్టైనా.. అనావృష్టైనా రైతుకే నష్టం.. ఏదో కాస్త వర్షాలు పడుతున్నాయి కదా.. అని రైతన్నలు పార పలుగు పట్టుకొని చేల బాట పట్టారు. పొలం దున్నడం.. నాటు వేయడంలో వ్యవసాయ కూలీలు బిజీగా ఉన్నారు. ఎప్పుడూ వ్యవసాయ కూలీ పనులు చేసి జీవించే ఓ రైతు ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చలాకీగా తోటి వారిని కవ్విస్తూ అందరికంటే పనిలో ముందుండే ఉండే రైతు గణుసుల వెంకటేశ్వర రావు (67) ఇంట్లో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది.
ఏడాది కాలంలో హృద్రోగాలతో భారత్లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా పొలంలో నాటు వేస్తూ ఓ రైతు మరణించిన ఘటన తూర్పుగోదావరిజిల్లాలో చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలో నాటు వేస్తుండగా ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రైతు గణుసుల వెంకటేశ్వర రావు (67) వరిపొలంలో నాటు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన తోటి వారు వెంటనే పొలం గట్టుమీదకు తీసుకొచ్చారు. అప్పటికే విగత జీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనకున్న వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గుండెపోటు సంభవించినప్పుడు సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన రైతు గణుసుల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.