హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్పీ పేపర్ లీకేజీ కేసు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిల ఈడీ విచారణ ముగిసింది. చంచల్గూడ జైలులో ఉన్న ఈ ఇద్దరిని సోమ, మంగళవారం ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడిన నలుగురు సభ్యుల ఈడీ టీమ్ ప్రశ్నించింది. రెండో రోజు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
వీరిద్దరి ఆర్థిక లావాదేవీలపై వివరాలు లాయర్ల సమక్షంలో సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్, టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు సత్యనారాయణ, శంకరలక్ష్మీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా సంబంధిత సిబ్బందిని ఈడీ ప్రశ్నించనుంది. ఇందుకోసం ఈ వారంలో కోర్టు అనుమతి తీసుకోనున్నట్లు తెలిసింది.
గ్రూప్1 పేపర్ కోసం మనీలాండరింగ్
రెండు రోజుల విచారణలో రాజశేఖర్రెడ్డి స్టేట్మెంట్ కీలకంగా మారినట్లు సమాచారం. న్యూజిలాండ్లోని తన బావ ప్రశాంత్రెడ్డికి పేపర్ పంపించిన వివరాలను ఈడీ సేకరించింది. విదేశాల్లోని ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించినట్ల తెలిసింది. రాజశేఖర్రెడ్డి తన బావ ప్రశాంత్రెడ్డికి ఎనీ డెస్క్ టీమ్ వ్యూవర్ ద్వారా పేపర్ పంపినట్లు రాజశేఖర్ అంగీకరించినట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్ ఇంటి నుంచి పేపర్ ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం.
గతేడాది అక్టోబర్ 16న గ్రూప్1 ప్రిలిమ్స్ జరగ్గా వారం రోజుల ముందే న్యూజిలాండ్కు పేపర్ చేరినట్లు తెలిసింది. ప్రశాంత్ రెడ్డి ద్వారా న్యూజిలాండ్లో నివాసం ఉంటున్న అతని ఫ్రెండ్స్, బంధువులకు పేపర్ వెళ్లిందా అనే కోణంలో ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా పేపర్ పొందిన వాళ్లు రాజశేఖర్రెడ్డికి లేదా అతని కుటుంబ సభ్యులకు డబ్బు పంపించారా అనే వివరాలను ఈడీ సేకరించినట్లు తెలిసింది.
ఏఈ, డీఏవో పేపర్ల లీక్తో రూ.27.5 లక్షలు
గ్రూప్ –1 పరీక్ష తరువాత ప్రవీణ్, రేణుక ఆమె భర్త ఢాక్య నాయక్, తమ్ముడు రాజేశ్వర్ చైన్ సిస్టమ్లో పేపర్ సేల్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అసిస్టెంట్ఇంజినీర్(ఏఈ) పేపర్ కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గోపాల్ నాయక్ నుంచి రూ.9 లక్షలు, నీలేశ్ నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసినట్లు స్టేట్మెంట్లో పేర్కొంది.
వీటితో పాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రశాంత్రెడ్డి నుంచి రూ.7.5 లక్షలు, రాజేంద్రకుమార్ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ డబ్బు ఎలా తీసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు ఆరా తీశారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా నగదు రూపంలో తీసుకున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
వీరితో పాటు డీఏవో పేపర్ లీకేజీతో ఖమ్మం జిల్లాకు చెందిన సుష్మిత భర్త సాయి లౌకిక్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.6 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.27.5 లక్షలు చేతులు మారినట్లు నిందితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.
మల్యాలలో 45 మందికి 100కు పైగా మార్కులు!
రాజశేఖర్రెడ్డి సొంత జిల్లా అయిన జగిత్యాలపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. రాజశేఖర్ విచారణలో వెల్లడించిన వివ రాల ఆధారంగా గ్రూప్ అభ్యర్థులను ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మల్యాల మండలంలో మొత్తం 45 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. అభ్యర్థులను ప్రశ్నించింది. వారి ఊర్లలో వివరాలు సేకరించింది.
హైకోర్ట్కు స్టేటస్ రిపోర్ట్ అందించింది. ఐతే రాజశేఖర్రెడ్డి బావ కూడ జగిత్యాల జిల్లాకు చెందిన వాడే కావడంతో ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వారం రోజుల ముందే న్యూజిలాండ్కు చేరిన పేపర్... జగిత్యాల జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతని బంధులు, ఫ్రెండ్స్కు చేరి ఉంటుందని ఈడీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.