- 21న లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరుకావాలన్న అధికారులు
- ఖండించిన ఆప్ లీడర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం సమన్లు జారీ చేశారు. ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) లో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ నెల 18న ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. పీఎంఎల్ యాక్ట్ కింద కేజ్రీవాల్పై ఇప్పటికే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.
ఈ కేసులో కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి అని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తాజాగా ఈడీ తొమ్మిదోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న ఈడీ హెడ్ ఆఫీస్లో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆప్ నేతలు ఖండించారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే మోదీ సర్కారు ఉద్దేశమని మండిపడ్డారు.
కేసు ఏంటో కూడా తెలియదు: మంత్రి అతిశీ
ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన కేసు ఏంటనేది కూడా ఎవరికీ తెలియదని మంత్రి ఆతిశీ మార్లేనా అన్నారు. సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా క్యాంపెయిన్కు వెళ్లకుండా కేజ్రీవాల్ను అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆప్ కామెంట్లపై బీజేపీ నేతలు స్పందించారు. ఈడీ సమన్లు జారీ చేస్తుంటే.. కేజ్రీవాల్ విచారణకు అటెండ్
అవ్వకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.