విద్యా సంస్థలు, గ్రంథాలయాలు విజ్ఞాన అభివృద్ధిలో రెండు కండ్లు

విద్యా సంస్థలు,  గ్రంథాలయాలు విజ్ఞాన అభివృద్ధిలో రెండు కండ్లు

నేటి విద్యార్థులు రేపటి పౌరులు కనుక విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా. విజ్ఞాన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లలో, విద్యాశాఖ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది. విద్యాశాఖ పర్యవేక్షణలో అట్టి నిధులను విద్యాభివృద్ధికి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యాలయాల్లో. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నగరాలు, పట్టణాల్లో  ఉన్న  ప్రతి ఒక్క గ్రంథాలయంలో తగిన వసతులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

పూర్వకాలంలో గ్రంథాలయ ఉద్యమం వలన గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రంథాలయంలో దినపత్రికలు, పోటీ పరీక్షల విలువైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, డిక్షనరీలు, మ్యాగ్జిన్​లు, కరెంట్ ఎఫైర్ వంటి పుస్తకాలను ప్రతి గ్రంథాలయంలో తప్పనిసరిగా ఉంచాలి. ప్రతి గ్రంథాలయంలో పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం, తగిన వసతులు, మంచినీళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ లు, తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. గ్రంథాలయాధికారులు తగిన సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు చేయడం జరుగుతుంది. అందుకోసం నిరుద్యోగులైన పట్టభద్రులు గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం జరుగుతుంది. వేలకు వేలు ఖర్చు చేసి విలువైన పుస్తకాలను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగ పట్టభద్రులైన యువత, లక్షలకు లక్షలు ఖర్చు చేసి నగరాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగులు గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోవడం జరుగుతుంది. 

ప్రతి సంవత్సరం గ్రంథాలయాలు నవంబర్​లో  వారోత్సవాలు మొక్కుబడిగా  జరుగుతాయి తప్ప వాటిని బాగు చేయాలనే తపన పాలకుల్లో లేకపోవడం దురదృష్టకరం.  ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థలను, గ్రంథాలయాలను, వేరువేరుగా చూడకుండా విద్యా వ్యవస్థలో విజ్ఞాన అభివృద్ధిలో రెండు కండ్లలాగా చూసి అభివృద్ధి చేయాల్సిందిగా మనవి. - ఈదునూరీ వెంకటేశ్వర్లు, వరంగల్