- హరీశ్ కోడ్ను ఉల్లంఘించారు: మల్లికార్జున ఖర్గే
- రైతులకు మేలు చేయాలని మామా అల్లుళ్లకు లేదు: రేవంత్
- రైతులకు ఇది బీఆర్ఎస్ శాపమే: కేసీ వేణుగోపాల్
- మూడేండ్లలో ఏనాడూ నవంబర్లో వేయలేదు: కోదండరెడ్డి
- గాంధీభవన్ ముందు కేసీఆర్, హరీశ్ దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావు వల్లనే రైతుబంధు పంపిణీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని కాంగ్రెస్ పేర్కొంది. ఇదే విషయాన్ని ఈసీ స్పష్టంగా చెప్పిందని వివరించింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు గురించి అనవసరంగా హరీశ్ మాట్లాడి రైతులను ముంచారని మండిపడింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విడుదల చేస్తామని తెలిపింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, కిసాన్ సెల్ నేతలు రైతుబంధుపై సోమవారం స్పందించారు. కేసీఆర్, హరీశ్ రావు తీరును నిరసిస్తూ వారి దిష్టిబొమ్మలను గాంధీభవన్ ముందు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎ. కోదండ రెడ్డి, మీడియా ఇన్చార్జ్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: ఖర్గే
ఎన్నికల కోడ్ను మంత్రి హరీశ్రావు ఉల్లంఘించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రైతుబంధును కాంగ్రెస్ ఆపించిందంటూ కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కమిషనే రైతు బంధు పథకాన్ని నిలపుదల చేసిందని, నోటిఫికేషన్ కన్నా ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతల బాధ్యతారహిత కామెంట్లే కారణం: కేసీ వేణుగోపాల్
ఎన్నికల కమిషన్ రైతు బంధును నిలిపేయడం రైతులకు అక్షరాలా బీఆర్ఎస్ పెట్టిన శాపమేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు బాధ్యతా రహితంగా వ్యవహరించారని, అందువల్లే ఈసీ రైతుబంధు పంపిణీని నిలిపేసిందని పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల హక్కు అని, ఏడాది కష్టానికిగానూ వారికి దక్కాల్సిన ప్రతిఫలమని చెప్పారు. అక్టోబర్ నుంచి జనవరి మధ్య రైతుబంధు డబ్బులను ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం ఉన్నా.. బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం, బాధ్యతా రహితమైన కామెంట్ల వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందన్నారు.
రైతులెవరూ ఆందోళన చెందొద్దు: రేవంత్
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. నిజంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశం మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్రావుకు లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని హరీశ్ రావు వ్యాఖ్యల వల్లే ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇలాంటి ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, అందరికీ ఎకరాకు రూ.15 వేలు జమచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హరీశ్ రావు కామెంట్లతోనే రైతుబంధు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ఈసీ స్పష్టంగా చెప్పిందని ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. తాము రైతుల పక్షానే ఉంటామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అక్టోబర్లోనే రైతుబంధు వేయాల్సింది: కోదండ రెడ్డి
రైతుబంధు పేరుతో ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ సర్కారు కుట్రలకు తెరలేపిందని, ప్రభుత్వ సొమ్మును వాడుకోవాలనుకున్నదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. 2018 ఎన్నికల టైంలోనూ ఇలాగే చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకున్నారని విమర్శించారు. అక్టోబర్ 1న రబీ సీజన్ ప్రారంభమవుతుందని, అప్పుడే రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేయాల్సిందని అన్నారు. మూడేండ్ల నుంచి ఏనాడూ బీఆర్ఎస్ సర్కారు నవంబర్లో రైతుబంధు పంపిణీ చేయలేదని, డిసెంబర్ చివరి వారంలోనే మొదలుపెట్టేవారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధును రైతుల ఖాతాల్లో వేస్తుందని అన్నారు.
రేవంత్ పేరిట ఫేక్ లెటర్
రైతుబంధును ఆపించాలంటూ ఎన్నికల కమిషన్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాసినట్టుగా ఓ ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతున్నది. హరీశ్ రావు కామెంట్లను దృష్టిలో పెట్టుకుని రైతుబంధును నిలిపేయాలని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని అందులో ఉంది. అయితే, అది ఫేక్ లెటర్ అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీనే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ దిగజారిపోయి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్నదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిని, డీజీపీని కోరారు.