పుట్టెడు కష్టాల్లో కల్వకుర్తి ఆయకట్టు

పుట్టెడు కష్టాల్లో కల్వకుర్తి ఆయకట్టు

నాగర్​కర్నూల్,​ వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం కింద ఈ వానాకాలం 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. రెండున్నరేండ్ల కింద ఎల్లూరు పంప్​హౌజ్​లో మూడో పంప్​ పూర్తిగా దెబ్బతినగా, ఐదో పంప్​ ఉపయోగంలో లేకుండా పోయింది. వీటిని రిపేర్​ చేయడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. పనుల పర్యవేక్షణ బాధ్యత ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డికి అప్పగించారు.

మధ్యలో సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్​ కూడా వర్క్స్​ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మూడు పంపులతో పని చేస్తున్నా ఎల్లూరు లిఫ్ట్​తో నాగర్​కర్నూల్, వనపర్తి, మహబూబ్​నగర్​ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. కనీసం నాలుగు పంపులు నడవకపోతే మూడు ప్యాకేజీల కింద ఉన్న టెయిట్​ఎండ్​ భూములకు సాగునీరు అందడం కష్టమవుతుంది. 

పనులు ముందర పడట్లే.. 

అక్టోబర్​ 2020లో ఎల్లూరు పంప్​హౌజ్​ ప్రమాదానికి గురైం ది. కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. 5 పంపులు ఉండగా, బ్లాస్టింగ్​ ధాటికి 3వ పంప్​ బేస్​ నుంచి పైకి లేచి పంప్​హౌస్​​మునిగింది.19 రోజులు కష్టపడి పంప్​హౌస్​ నుంచి నీటిని తోడేశారు. అప్పటి నుంచి రిపేర్లు నడుస్తూనే ఉన్నాయి. పంప్​హౌస్, సర్జ్​పూల్​ మధ్యలో 50 మీటర్ల మందంలో ఉండే రాక్​ లెడ్జర్​కు పగుళ్లు వచ్చి నీరు పంప్​హౌజ్​లోకి రావడంతో షటర్లు క్లోజ్​ చేశారు.​ పంపులతో పాటు రాక్​ లెడ్జర్​ పగుళ్ల రిపేర్​ పనులను మెగా కంపెనీకి అప్పగించారు. అప్రోచ్​ కెనాల్​ ముందుభాగంలో హెడ్​ రెగ్యులేటర్​ ఏర్పాటు చేసి సర్జ్​పూల్​పై వరద జలాల ఒత్తిడి లేకుండా చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కాలువలో నీటిని తోడేసి సర్జ్​పూల్​ ముందుభాగంలో ప్రొటెక్షన్​ వాల్​ నిర్మించి, గేట్లు ఫిట్​ చేయాలని ప్రతిపాదించారు.

796 అడుగుల నుంచి  845 అడుగుల ఎత్తులో గోడ, గేట్ల నిర్మాణం అసాధ్యమని వదిలేశారు. కృష్ణా నది నుంచి వరద నీరు ఓపెన్​ కెనాల్, అండర్​ టన్నెల్​ ద్వారా ఎల్లూరు సర్జ్​పూల్​లోకి చేరుతున్నాయి. నీటి వేగానికి పంప్​హౌజ్​ గేట్లు దెబ్బతింటున్నాయి. కేఎల్ఐ ప్రాజెక్ట్​ డీపీఆర్​లో నది ముందు భాగంలో హెడ్​ రెగ్యులేటర్​ నిర్మించి సర్జ్​పూల్, పంప్​హౌస్​పై వరద ప్రవాహం ఒత్తడి లేకుండా చేయాలని ఉన్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేశారు.

దీంతో రెండు సార్లు పంప్​హౌస్​లోకి వరద నీరు వచ్చి నీట మునిగింది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన కంపెనీలకు పనులు అప్పగిస్తున్నా రిపేర్లు మాత్రం కంప్లీట్​ కావడం లేదు. రిపేర్లు కంప్లీట్​ చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి.

మిషన్​ భగీరథ నీటికి కష్టమే..

జొన్నలబొగడ లిఫ్ట్​లో 4వ పంప్​ ఫెయిల్​ అయి రెండేండ్లు దాటింది. ఆస్ట్రియా కంపెనీ నుంచి స్పేర్​ పార్ట్స్​ వస్తే కాని అది పని చేయదు. రెండేండ్లు కరోనా కారణంగా దాన్ని ముట్టుకోలేదు. గుడిపల్లి గట్టులోని ఐదు పంపుల్లో మూడే పని చేస్తున్నాయి. ఇక కల్వకుర్తి లిఫ్ట్​లో మూడు పంపులతో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్​ భగీరథకు నీటిని అందించడం భవిష్యత్​లో కష్టంగా మారుతుందని ఇంజనీర్లే చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే లోపు పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్​ స్టార్ట్​ చేసి ఒక్క పంప్, మోటార్​తోనైనా నీళ్లిచ్చామని చెప్పకోవడానికి ప్రభుత్వం ఆరాటపడుతోంది.

ఈ ప్రాజెక్ట్​లో కీలకమైన నార్లాపూర్​ రిజర్వాయర్, మెయిన్​ కెనాల్, పంప్​హౌస్, సర్జ్​పూల్​ ఎలక్ట్రో మెకానికల్​ వర్క్స్​ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. దీంతో కల్వకుర్తి మెయిన్​ కెనాల్​ నుంచి ఏదుల రిజర్వాయర్​కు లింక్​ ఇచ్చారు. ఎల్లూరు నుంచి నీటిని తరలించి అక్కడ ఒక్క పంప్​ స్టార్ట్​ చేయగలిగితే చాలని ఇంజనీర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కేఎల్ఐ చివరి ఆయకట్టుకు నీళ్లు ఎలా ఇస్తారనే విషయంపై దృష్టి పెట్టడం లేదు.