దాయాదిదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొన్నది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆ దేశం విద్యుత్ ఆంక్షలు విధించింది. చివరకు అధికారులు, దేశంలోని కీలక మంత్రులు సైతం సన్ లైట్లోనే విధులు నిర్వహించాలని ఆ దేశం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించాలని.. త్వరగా పడుకొని.. త్వరగా నిద్రలేవాలని ఆ దేశ అధికారులు పిలుపునిస్తుండటం గమనార్హం. ఇక ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి అమెరికాలోని రాయబార కార్యాలయాలను సైతం అమ్మేయాలని పాక్ నిర్ణయం తీసుకున్నది.
సంక్షోభానికి కారణం ఇదేనా?
దిగుమతులు మీద ఎక్కువగా ఆధారపడి రావడంతోనే పాక్ లో సంక్షోభం ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానంగా వంటనూనెను దిగుమతి చేసుకుంటోంది. అయితే నిధుల కొరత కారణంగా ప్రస్తుతం దిగుమతి తగ్గిపోయింది. దీంతో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ.. వాటిని బయటకు తీసుకొచ్చేందుకు బ్యాంకుల నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మైన వంట నూనె కొరత ఏర్పడింది. ఇప్పటికే భారీగా వంట నూనె ధరలు పెరగగా.. భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరదలే పాకిస్తాన్ కొంపముంచాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా వరదలు రావడంతో దేశంలోని మూడో వంతు భాగం ముంపునకు గురైంది. దీంతో వ్యవసాయ ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాక్ ఎగుమతులు పడిపోయాయి. ప్రస్తుతం ఆ దేశం దిగుమతుల మీదే ఆధారపడి పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5. 5 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలవైపు మొగ్గుచూపుతోంది.
విద్యుత్ ఆంక్షలు ఎందుకంటే..
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పాకిస్తాన్ కేబినెట్ విద్యుత్ ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వాడకాన్ని 30 శాతం తగ్గించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా మాల్స్, మార్కెట్లు రాత్రి 8.30 నిమిషాల వరకే బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేయనున్నారు. ప్రస్తుత పరిస్థితి పట్ల పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం కావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఎనర్జీ సేవింగ్ ప్లాన్ లో భాగంగా విద్యుత్ ను ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.
రాయబార కార్యాలయాలు ఫర్ సేల్
పాకిస్తాన్ ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారింది. అమెరికాలోని రాయబార కార్యాలయాలను అమ్మేయాలని ఆ దేశం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇందన పొదుపు పాటించాలని నిర్ణయం తీసుకున్న పాక్.. ఫ్యాన్లు, బల్బుల తయారీ మీద నిషేధం విధించింది. కాగా పాక్ ప్రభుత్వ తీరుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు.