- నాలుగో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం
- రెండు రోజుల్లోనే ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై 15 ఏండ్లుగా కొనసాగుతున్న పరాజయాలకు ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు బ్రేక్ వేసింది. రెండు రోజుల్లోనే ముగిసిన యాషెస్ నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో కంగారూల ఆధిక్యం 3–1కి తగ్గించింది. ఆసీస్ గడ్డపై వరుసగా 18 టెస్టుల తర్వాత ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలిచింది. 5,468 రోజుల తర్వాత రెడ్ బాల్ ఫార్మాట్లో తొలి విజయం రుచి చూసింది.
2010–11 యాషెస్ సిరీస్ను 3–1తో గెలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత జరిగిన ఏ సిరీస్లోనూ విజయం సాధించలేదు. అప్పట్నించి ఇంగ్లండ్ ఆడిన 18 టెస్ట్ల్లో 16సార్లు ఓడింది. రెండు మ్యాచ్లు డ్రా చేసుకుంది.
ఓవరాల్గా 129 ఏండ్ల తర్వాత ఒకే సిరీస్లో రెండు టెస్ట్లు రెండు రోజుల్లోనే ముగియడం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లోనూ 11 రోజుల్లోనే మూడు టెస్ట్లు గెలిచి యాషెస్ను నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఇంగ్లిష్ టీమ్ జోరును అడ్డుకోలేకపోయింది. హోమ్ టీమ్ నిర్దేశించిన 175 రన్స్ టార్గెట్ను ఛేజ్ చేసేందుకు శనివారం రెండో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 32.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసి నెగ్గింది. జాకబ్ బెథెల్ (40), జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34), మెరుగ్గా ఆడారు. బ్రైడన్ కార్స్ (6), జో రూట్ (15), బెన్ స్టోక్స్ (2) నిరాశపర్చారు.
అంతకుముందు 4/0 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 34.3 ఓవర్లలో 132 రన్స్కే ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (46) టాప్ స్కోరర్. కార్స్ 4, స్టోక్స్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు తీశారు. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసిన జోష్ టంగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఐదో, చివరి టెస్ట్ వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.
